Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. మాలధారణ చేసిన భక్తులు ఇకపై ఇరుముడిని విమానంలో కూడా తీసుకెళ్లొచ్చు. దీనికి విమానయాన భద్రతా విభాగం తాజాగా అనుమతించింది.
Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ఇకపై విమానంలో కూడా ఇరుముడి తీసుకెళ్లొచ్చు. దీనికి విమానయాన భద్రతా విభాగం (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)) అనుమతించింది. దీనికి సంబధించిన మార్గదర్శకాలు, ఆదేశాల్ని తాజాగా జారీ చేసింది.
తాజా నిబంధనల ప్రకార కేరళలోని, శబరిమలకు వెళ్లే భక్తులు తమ వెంట కొబ్బరికాయ, పూజ సామగ్రి వంటి ఇరుముడిని విమానంలో తీసుకెళ్లొచ్చు. అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులు స్వామి వారికి నెయ్యి, కొబ్బరి కాయ, ఇతర ద్రవ్యాలతో కూడిన ఇరుముడిని శబరిమల వెళ్లి సమర్పిస్తారు. అయితే, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీటిని విమానంలో తీసుకెళ్లే విషయంలో ఆంక్షలు ఉండేవి. భక్తుల వినతి మేరకు వీటిని తీసుకెళ్లేందుకు తాజాగా అనుమతించింది. దీని కోసం ఇరుముడితోపాటు పూర్తి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఏఎస్జీ (ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్) అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. ఫిజికల్ చెకప్, ఎక్స్ రేతోపాటు ఈటీడీ (ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్) ద్వారా వివిధ తనిఖీలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. అది కూడా క్యాబిన్ లగేజీ(క్యారీ ఆన్)లో మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఈ వెసులుబాటు అమలులో ఉంటుంది. ఇటీవలే శబరిమలలోని అయ్యప్ప దేవాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 16 నుంచి వచ్చే జనవరి 20 వరకు ఈ దేవాలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దీంతో భారీ ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళ్తున్నారు.