పార్లమెంట్ సమావేశాలు : పేపర్ లెస్ బడ్జెట్, బడ్జెట్ ఎప్పుడంటే

పార్లమెంట్ సమావేశాలు : పేపర్ లెస్ బడ్జెట్, బడ్జెట్ ఎప్పుడంటే

Sessions of Parliament: : కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై లోక్ సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత జాతీయ ఆర్థిక సర్వే నివేదిక విడుదల కార్యక్రమాలు ఉంటాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, సంప్రదాయాలు, పద్ధతులను పక్కన పెట్టి కరోనా పేపథ్యంలో పేపర్ లెస్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం కాగా.. దానిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. ఇందులో భాగంగానే ఈ దఫా బడ్జెట్‌లో కూడా సంక్షేమ రంగానికి, వ్యాపార రంగాన్ని బలోపేతం చేసేలా నిర్ణయాలు ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై చర్చ అనంతరం ఫిబ్రవరి 15 నుంచి పార్లమెంటుకు విరామం ప్రకటించనున్నారు. మళ్లీ మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8తో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
కరోనా కారణంగా గతేడాది పార్లమెంటు సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం కరోనా బారినపడడంతో వర్షాకాల సమావేశాలను బాగా కుదించారు. శీతాకాల సమావేశాలను కూడా నిర్వహించలేదు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత సమావేశాల్లో సమయాభావం కారణంగా క్వశ్చన్ అవర్ నిర్వహించలేదు.