CJI NV Ramana : సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ తీవ్ర అసంతృప్తి
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులు ఇవేనంటూ మీడియాలో వస్తున్న వార్తలు రావడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
CJI NV Ramana సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులు ఇవేనంటూ మీడియాలో వస్తున్న వార్తలు రావడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంపై మీడియాలో వస్తున్న వార్తలు బాధాకరమని బుధవారం ఎన్వీ రమణ అన్నారు. పేర్లను కొలీజియం ఖరారు చేయకముందే, ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందే ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. ఇలాంటి నియామకాలపై అధికారిక ప్రకటన కంటే ముందే వార్తలు రావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎన్వీ రమణ అన్నారు.
బుధవారం పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ నవీన్ సిన్హా వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ…జడ్జీల నియామక ప్రక్రియకు ఓ పవిత్రత, హుందాతనం ఉంటాయి. మీడియా స్నేహితులు ఈ ప్రక్రియ పవిత్రతను అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. ఇలాంటి బాధ్యతా రహిత రిపోర్ట్ల కారణంగా అర్హులైన అభ్యర్థులకు పదవులు దక్కని ఘటనలు చాలా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం. వీటిపై నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి తీవ్రమైన అంశంపై సీనియర్ జర్నలిస్టులు, మీడియా హౌజ్లు కాస్త పరిణతితో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ అసత్య ప్రచారానికి దూరంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలను సీజేఐ ప్రశంసించారు.
కాగా,కొత్త జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు ఇవీ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సుల ప్రకారం 2027లో దేశానికి తొలి మహిళా సీజేఐ రాబోతున్నారని, ఆమె కర్ణాటక జడ్జిగా ఉన్న నాగరత్నే కావచ్చని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.