India: భారత్ లో “స్పుత్నిక్ వీ” వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం..హైదరాబాద్ లో తొలి డోస్
కరోనా కట్టడికోసం రష్యా అభివృద్ధి చేసిన "స్పుత్నిక్ వీ"వ్యాక్సిన్ భారత మార్కెట్ లోకి వచ్చేసింది.
Sputnik V : కరోనా కట్టడికోసం రష్యా అభివృద్ధి చేసిన “స్పుత్నిక్ వీ”వ్యాక్సిన్ భారత మార్కెట్ లోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి హైదరాబాద్ లో స్పుత్నిక్ వీ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ తొలి డోస్ను డాక్టర్ రెడ్డీస్ కస్టమ్ ఫార్మా సర్వీసెస్ గ్లోబల్ హెడ్ దీపక్ సప్రా తీసుకున్నారు. స్పుత్నిక్ టీకా ధరను కూడా డాక్టర్ రెడ్డీస్ నిర్ణయించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ ఒక్క డోస్ ధర రూ.995.40 (5శాతం జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతమైన సాధనం..భారత్ లో చేపట్టిన అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు తోడ్పాటును అందించడమే మా అతి పెద్ద ప్రాధాన్యత అని డాక్టర్ రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా,రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (RDIF) సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకా అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో కోవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత డీసీజీఐ అనుమతి పొందిన మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ కావడం గమనార్హం. కాగా మన దేశంలో స్పుత్సిక్ వీ టీకా పంపిణీ, ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్తో RDIF ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రష్యా నుంచి తొలి విడతలో 1.50లక్షల వ్యాక్సిన్ డోసులు ఇటీవలే హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ కు చేరుకున్నాయి. ఈ టీకాల పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ నుంచి మే 13న అనుమతి వచ్చిందని..దీంతో మే 14 నుంచి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది.
రష్యా నుంచి మొత్తం 10 కోట్ల డోస్లను డాక్టర్ రెడ్డీస్ దిగుమతి చేసుకొని మన దేశంలో పంపిణీ చేయనుంది. ఆ తర్వాత జులై నుంచి ఇక్కడే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు. స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టీకా ధర తగ్గే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధులు చెప్పారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 91శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది. ఈ వ్యాక్సిన్ ను మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో కోవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత డీసీజీఐ అనుమతి పొందిన మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ కావడం గమనార్హం. స్పుత్నిక్ టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత.. మూడు వారాల వ్యవధిలో రెండో టీకా తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్తో పాటు గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పనాకీ బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ సంస్థలతో కలిసి మనదేశంలో ఏటా 85 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని RDIF లక్ష్యంగా పెట్టుకుంది.
First doses of #SputnikV administered in India. On the picture Deepak Sapra, Global Head of Custom Pharma Services at @drreddys Laboratories is getting a shot of Sputnik V in Hyderabad. ✌️ pic.twitter.com/iBbTeB2DmT
— Sputnik V (@sputnikvaccine) May 14, 2021