బీభత్సమే : తమిళనాడుకి తుఫాన్ హెచ్చరిక
మండు వేసవిలో అకాల వర్షాలు పడి రైతులను నట్టేటముంచాయి. మండుతున్న ఎండల్లో వర్షాలు పడటం ప్రజలకు కాస్తంత చల్లదనం ఏర్పడినా.. పంటలకు మాత్రం భారీగా నష్టం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు తుఫాను హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ కేంద్రం. కాగా ఏప్రిల్ 23న ఉత్తర కన్నడ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
బంగాళాఖాతం, హిందూమహాసముద్రం మధ్య ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని చెన్నై వాతావరణశాఖ అధికారులు బుధవారం (ఏప్రిల్ 24) హెచ్చరించారు. ఈ వాయుగుండం బలోపేతమై చెన్నై వైపు పయనిస్తుందని, దీనివల్ల తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఈ తుపాన్ ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారి హెచ్చరించారు.