G7కి రండి…మోడీకి బ్రిటన్ ఆహ్వానం

G7కి రండి…మోడీకి బ్రిటన్ ఆహ్వానం

UK Invites PM Modi For G7 ఈ ఏడాది జూన్‌లో బ్రిట‌న్‌లోని కార్న్‌వాల్ లో జ‌రిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజ‌రు కావాల్సిందిగా భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానం పలికింది. ప్ర‌పంచంలోని 7 ప్ర‌జాస్వామ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌లైన యూకే, జ‌ర్మ‌నీ, కెన‌డా, ఫ్రాన్స్‌, జ‌పాన్‌, ఇట‌లీ, యూఎస్ఏ.. జీ7 దేశాలుగా ఉన్నాయి. జూన్ 11-14 మధ్య జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఇందులో భారత్ సభ్యదేశం కానప్పటికీ ఆతిథ్య హోదాలో సమావేశంలో పాల్గొంటుంది.

భారత్​తో పాటు, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాధినేతలను సైతం ఈ స‌ద‌స్సుకు ప్ర‌త్యేక అతిథులుగా బ్రిటన్ ఆహ్వానించింది. జీ7 స‌ద‌స్సులో భాగంగా ఈ దేశాలు క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి, ప‌ర్యావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు, సాంకేతిక‌ప‌ర‌మైన మార్పులు, శాస్త్రీయ ఆవిష్క‌ర‌ణ‌లు, స్వేచ్ఛా వాణిజ్యంపై చ‌ర్చించ‌నున్నాయి.

కాగా, రిప‌బ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా ఢిల్లీకి వస్తానని.. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్న‌ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌.. జీ7 స‌ద‌స్సు ముందు ఇండియాలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు బ్రిటన్ ప్రధాని. భారత్​ను ప్రపంచ ఔషధాలయంగా అభివర్ణించారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో భారతదేశ కృషిని కొనియాడారు. ప్రపంచంలోని టీకాలలో 50 శాతం భారత్​లోనే తయారయ్యాయని గుర్తు చేశారు. మహమ్మారి సమయంలో ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేశాయన్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు