జగన్కు సహకరించిన అధికారులు, నేతలు జైలుకెళ్తారు
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని అన్నారు. విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సహకరించిన అధికారులు, నేతలు జైలుకెళ్తారని దేవినేని ఉమ హెచ్చరించారు. జగన్ కి సీఎం నేమ్ ప్లేట్ మాత్రమే మిగులుతుందని సెటైర్ వేశారు. వైఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా నదిపై నీటి హక్కును కోల్పోయామని దేవినేని ఉమ ఆరోపించారు. 448 టీఎంసీల మేర ప్రాజెక్టులు కట్టుకునే హక్కుని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ నిర్వాకం వల్లే ఏపీకి నష్టం జరుగుతోందని అన్నారు. టీడీపీని విమర్శించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. తుపానుపై సమీక్షలు చేస్తుంటే వైసీపీ విమర్శించడం దారుణం అన్నారు. పోలవరాన్ని ఆపేందుకు కేసీఆర్తో జగన్ చేతులు కలిపారని దేవినేని ఉమ ఆరోపించారు.
ఆలమట్టి గేట్లపై ఐదేళ్లుగా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నామని దేవినేని ఉమ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రం కోసం సుప్రీంలో కేసులు వేశామని గుర్తు చేశారు. జగన్ కు ఇరిగేషన్ పై ఏమాత్రం అవగాహన లేదన్నారు. వారంలో పట్టిసీమ నుంచి గోదావరి నీటిని తరలిస్తామని మంత్రి చెప్పారు. కృష్ణా జలాల కేటాయింపులో ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీకి మరిన్ని జలాలు రావాలన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ఏపీ వాదనను బలంగా విన్పిస్తున్నామని వెల్లడించారు.