అమరావతి భూముల కుంభకోణంపై త్వరలో ఈడీ విచారణ

  • Published By: chvmurthy ,Published On : February 3, 2020 / 11:38 AM IST
అమరావతి భూముల కుంభకోణంపై త్వరలో ఈడీ విచారణ

అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్‌ సబ్‌కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా భూములు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులపై సీఐడీ విచారణ చేస్తోంది. 

అమరావతి కోర్‌ ఏరియాలో 720 ఎకరాల భూమిని తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తంగా 790 మంది తెల్ల రేషన్‌ కార్డు హోల్డర్లకు అధికారులు నోటీసులు కూడా జారీచేశారు. అలాగే అమరావతి భూముల కొనుగోలుపై విచారణ చేయాలంటూ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ ఈడీకి లేఖ రాశారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు, తెల్లరేషన్‌ కార్డు హోల్డర్ల వివరాలను ఈడీకి పంపించారు. ఈ లేఖకు సంబంధించి ఈడీ రెండు రోజుల్లో రంగంలోకి దిగనున్నట్టుగా సమాచారం.