TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
టీటీడీ కోసం రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన రైతులు భక్తిశ్రద్ధలతో పంటలు పండించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.(TTD EO DharmaReddy)
TTD EO DharmaReddy : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాల తయారీకి వీలుగా మలి విడతలో 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్లతో ఒప్పందం చేసుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
2021, అక్టోబర్ 11న సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థతో ఎంవోయూ చేసుకున్నట్టు ఈవో తెలిపారు. ఈ మేరకు తొలి విడతలో 500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశామన్నారు. మలి విడతలో ప్రస్తుతం బియ్యం, శనగలు, బెల్లం, కందిపప్పు, పెసలు, పసుపు, వేరుశనగ, మిరియాలు, ధనియాలు, ఆవాలు, చింతపండు, ఉద్దిపప్పు సేకరించాలని నిర్ణయించామన్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కొనుగోలు చేస్తుందని, ఈ సంస్థ నుండి మార్క్ఫెడ్ కొనుగోలు చేసి తగిన విధంగా మార్పుచేసి టీటీడీకి అందిస్తుందన్నారు. ఈ వ్యవస్థలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని చెప్పారు.
టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిందని, ప్రజలు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆదరించాలని ధర్మారెడ్డి కోరారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేని పంట ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటామని, ఈ మేరకు అనారోగ్య సమస్యలకు పెట్టే ఖర్చు తగ్గుతుందని చెప్పారు. టీటీడీ కోసం రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన రైతులు భక్తిశ్రద్ధలతో పంటలు పండించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. టీటీడీ స్ఫూర్తితో రాష్ట్రంలోని ఇతర ఆలయాలు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో అన్నప్రసాదాలు తయారు చేసేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. క్రమక్రమంగా హోటళ్లు, ఇతర సంస్థలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఈవో కోరారు.
రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్ కలిసి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన శనగపప్పును టీటీడీకి సరఫరా చేసినట్టు రాష్ట్ర రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ విజయకుమార్ తెలిపారు. మొదటి దశలో 1300 మెట్రిక్ టన్నుల శనగలను రైతుల నుండి సేకరించి రసాయన అవశేషాలను పరిశీలించడం జరిగిందన్నారు. మలి దశలో 12 రకాల వంట సరుకులను సేకరించేందుకు ప్రకృతి వ్యవసాయ రైతుల ఎంపిక జరుగుతోందని, ప్రత్యేక పర్యవేక్షణలో రసాయనాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకుని పంటలు పండిస్తారని తెలిపారు. గతేడాది గోశాల నుండి 1800 ఆవులు, ఎద్దులను ప్రకృతి వ్యవసాయ రైతులకు టీటీడీ అందించినట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలల వద్ద మిగులుగా ఉన్న ఆవులను, ఎద్దులను రైతులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందన్నారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు రసాయన రహిత వంట సరుకులతో తయారుచేసిన ప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించడం ముదావహం అని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మొదటగా లడ్డూ తయారీకి వినియోగించే శనగలను ప్రయోగాత్మకంగా సేకరించిందన్నారు. ఈసారి రాష్ట్ర రైతు సాధికార సంస్థ పర్యవేక్షణలో ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన 12 రకాల వంట సరుకులను మార్క్ఫెడ్ ద్వారా సేకరించి టీటీడీకి అందజేస్తామన్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 1,276 మెట్రిక్ టన్నుల శనగలు ఇవ్వాలని టీటీడీ కోరగా 500 మెట్రిక్ టన్నులు సేకరించి అందించామని మార్క్ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న అన్నారు. కనీస మద్దతు ధర కంటే 10 శాతం ఎక్కువగా చెల్లించడం ద్వారా అటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని, ఇటు టీటీడీకి నాణ్యమైన, ఆరోగ్యకరమైన వంట సరుకులు అందుతాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ రైతులకు 7 నుండి 10 రోజుల్లోపు మార్క్ఫెడ్ సొమ్ము చెల్లిస్తుందని, ఆ తర్వాత టీటీడీ నుండి మార్క్ఫెడ్ రీయింబర్స్మెంట్ తీసుకుంటోందని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామన్నారు.