IndVsAus 2nd T20I : రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం

నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.

IndVsAus 2nd T20I : రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం

IndVsAus 2nd T20I : సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా దుమ్మురేపింది. నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్, దినేశ్ కార్తీక్ మెరుపులతో టీమిండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 91 పరుగుల టార్గెట్ ను మరో 4 బంతులు మిగిలి ఉండగానే భారత్ చేధించింది. రోహిత్ సేన 7.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ… చెలరేగాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముందుండి మరీ జట్టుని గెలిపించాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ 2 బంతుల్లోనే 10 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.

కాగా, ఈ మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. గతరాత్రి కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా ఉండడంతో ఓవర్లను 20 నుంచి 8కి తగ్గించారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ వేడ్ 43(20 బంతుల్లో-నాటౌట్), ఫించ్ 31(15 బంతుల్లో) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు.

అనంతరం లక్ష్యఛేదనను టీమిండియా దాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు సాధించి తన ఉద్దేశాన్ని చాటింది. కేఎల్ రాహుల్ 10, కోహ్లీ 11, పాండ్యా 9 పరుగులు చేశారు. ఆఖర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా, తొలి బంతిని సిక్స్, రెండో బంతిని ఫోర్ కొట్టిన దినేశ్ కార్తీక్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.

ఈ విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది భారత్. ఇక సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనుంది.