గోదావరి నుంచి 530 టీఎంసీలు వినియోగించుకోనున్న తెలంగాణ

  • Published By: bheemraj ,Published On : July 10, 2020 / 02:09 AM IST
గోదావరి నుంచి 530 టీఎంసీలు వినియోగించుకోనున్న తెలంగాణ

అత్తెసరు ఆయకట్టుకే నీరందించే నిర్లిప్తత నుంచి ఆరేళ్లళ్లో గోదావరి బేసిన్‌ ఆకుపచ్చ మాగాణంలా మారింది. 2014లో 100 టీఎంసీల జలాల వినియోగానికే పరిమితం అయింది. కాగా ఈ ఏడాది ఏకంగా 530 టీఎంసీలను వాడుకొనేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. గతేడాది 250 టీఎంసీల వరకు గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించగా.. ఈ ఏడాది రెట్టింపుకుపైగా వినియోగానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో శ్రీరాంసాగర్‌కు వరదవచ్చినా, రాకున్నా.. ఈ స్థాయి వినియోగానికి కార్యాచరణ సిద్ధమైంది.

శ్రీరాంసాగర్‌, దేవాదుల, కడెం, ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర, ఎల్‌ఎండీ, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ పరిధుల్లో రెండు సీజన్లలోనూ వేల చెరువులను నింపడం.. వ్యవస్థసిద్ధంగా ఉన్నచోట నేరుగా ఆయకట్టుకు సాగునీరందించడంతో గోదావరి జలాల వినియోగం 500 టీఎంసీలు దాటనున్నది.

ఇప్పటికిప్పుడు 200 టీఎంసీలకుపైగా నిల్వకు జలాశయాలు సిద్ధంగా ఉండటంతో కరువుఛాయలు ఉండవని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. గతేడాది నిజాంసాగర్‌, సింగూరు ఆయకట్టుకు సాగునీరు అందలేదు. గతేడాది ఎస్సారెస్పీకి పునర్జీవం తెచ్చిన కాళేశ్వరం.. ఈ ఏడాది ఈ రెండింటికీ జీవం పోసేందుకు సిద్ధమవుతోంది.