Corona for 140 students : తెలంగాణ వ్యాప్తంగా 140 మంది విద్యార్ధులకు కరోనా..స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం
తెలంగాణలోకరోనా కేసులు భయపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వం త్వరలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఆలోచన చేస్తోంది.
Corona positive for 140 students : తెలంగాణలోకరోనా కేసులు భయపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వం త్వరలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఆలోచన చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 140 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో కరోనా తీవ్రతపై ప్రభుత్వం అప్రమత్తమయింది. విద్యాశాఖ మంత్రితో ఇప్పటికే సీఎం కేసీఆర్ చర్చించారు. ఒకటో తరగతి నుంచి 8వరకు ప్రమోట్ చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇకపై 9,10 తరగతుల విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణ పాఠశాలల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే పలు పాఠశాలల్లో 104 మంది విద్యార్థులు కరోనా భారినపడితే…బుధవారం మరింత మందికి వైరస్ సోకింది. నిర్మల్ జిల్లా భైంసాలోని గురుకుల పాఠశాలలో 10 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఇందులో తొమ్మిదిమంది విద్యార్థులుంటే…మరొకరు పాఠశాల సిబ్బంది.
మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో 76 మందికి విద్యార్ధులకు కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 16 మందికి పాజిటివ్గా తేలింది. మొన్న బాలికల పాఠశాలలో 52 మంది కరోనా బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన డీఈఓ మూడు రోజులపాటు స్కూల్కు సెలవులు ప్రకటించారు. విద్యార్ధులు కరోనా బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు భయందోళనకు గురవుతున్నారు. కోవిడ్ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ విద్యాసంస్థల్లో మూడు రోజుల్లో విపరీతంగా కేసులు పెరిగాయి. మల్కాజ్గిరి- మేడ్చల్ జిల్లాలోని నాగోల్లో మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 38 పాజిటివ్ కేసులొచ్చాయి. కామారెడ్డి జిల్లా కస్తూర్బా గాంధీ స్కూల్లో 32 మంది విద్యార్థినిలకు వైరస్ సోకింది. కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఒక విద్యార్థి, ఇద్దరు టీచర్లకు కరోనా సోకింది. జమ్మికుంట జిల్లా పరిషత్ స్కూల్లో ఒక విద్యార్థికి, కరీంనగర్ సోషల్ వెల్ఫేర్లో ఆరుగురికి, ఇద్దరు టీచర్లకు, ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దుర్షేడ్ గవర్నమెంట్ స్కూల్లో 8 మందికి వైరస్ సోకింది. ఆసిఫాబాద్లో ఆరుగురికి, కెరమెరిలో ఒక విద్యార్థికి, కాగజ్నగర్లో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మంచిర్యాల, జగిత్యాల, మేడ్చల్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థల్లో కరోనా వ్యాపిస్తుండడంతో.. ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్స్ మూసివేత దిశగా ఆలోచన చేస్తోంది. తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు కేసీఆర్. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలల నిర్వహణపై తానే స్వయంగా రెండు మూడు రోజుల్లో సభలోనే ప్రకటన చేస్తామన్నారు కేసీఆర్….
అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో…మహారాష్ట్ర నుంచి వస్తున్నవారికి టెస్ట్లు చేస్తున్నారు. సాలూరా- సలాబాత్ పూర్ చెక్పోస్ట్ల వద్ద కరోనా టెస్ట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, బోధన్, నవీపేట, కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కంద మండలాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చే ప్రధాన దారులైన సాలూరా, మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. టెస్టులు చేసిన తర్వాతనే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. పాజిటివ్ తెలితే వెనక్కి పంపిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు 10 నుంచి 20 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్లో ఇప్పటి వరకు 15 వేల 780.., కామారెడ్డి జిల్లాలో 13 వేల 624 కేసులు నమోదయ్యాయి. 80 శాతం మంది హోం క్వారంటైలో ఉండి కోలుకున్నారు.