Corona Positive Rate : తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ రేటు.. 5 రోజుల్లోనే రెట్టింపు
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే రెట్టింపు అయింది. మార్చి 31న పాజిటివ్ రేటు 1.49 శాతం నమోదు కాగా.. ఏప్రిల్ 4వతేదీ నాటికి అమాంతంగా 2.54కు పెరిగింది.
Covid-19 Positive Rate : తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే రెట్టింపు అయింది. మార్చి 31న పాజిటివ్ రేటు 1.49 శాతం నమోదు కాగా.. ఏప్రిల్ 4వతేదీ నాటికి అమాంతంగా 2.54కు పెరిగింది. మార్చి రెండో వారం నుంచి కరోనా టెస్టుల సంఖ్య రోజూ సగటున 45వేల నుంచి 50 వేలు దాటుతున్నాయి. గత ఏడాది నవంబరులో ఒక్క రోజులో వెయ్యి కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో ఏప్రిల్ నెలలోనూ మూడు రోజులుగా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా చికిత్స పొందే బాధితులు కూడా గత వారం రోజుల్లో రెట్టింపయ్యారు. గత నెల 29న చికిత్స పొందే కొవిడ్ బాధితులు 4,678 మంది ఉన్నారు. గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 4న బాధితుల సంఖ్య 8,746కు చేరింది. రాష్ట్రంలోని బాధితుల్లో దాదాపు సగం మంది(4,458) మాత్రమే ఐసొలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన వారంతా ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 1,097 కొత్త పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3,13,237కు చేరింది. మరో 6 మరణాలు నమోదయ్యాయి. దాంతో మరణాల సంఖ్య 1,723గా నమోదైంది. కొత్తగా 268 మంది కరోనాకు చికిత్సతో మొత్తంగా 3,02,768 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో 37,338 ప్రైవేటులో 5,732 టెస్టులు నిర్వహించారు. మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,04,35,997కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 302 కొత్త కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్లో 22, ఆదిలాబాద్లో 24, జగిత్యాలలో 32, కామారెడ్డిలో 28, కరీంనగర్లో 38, మేడ్చల్ మల్కాజిగిరిలో 138, నిర్మల్లో 42, సంగారెడ్డిలో 52, వరంగల్ నగర జిల్లాలో 28, నిజామాబాద్లో 77, రంగారెడ్డిలో 116 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో టీకాల వృథా 2.77 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
బాధితుల్లో 79.8 శాతం మంది ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ వస్తోందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ‘కొవిడ్ను త్వరితగతిన అడ్డుకోవడంలో భాగంగా బాధితులతోపాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులకూ టెస్టులు చేస్తున్నారు. 48.6 శాతం మంది ప్రైమరీ, 12.5 శాతం మంది సెకండరీ కాంటాక్టు వ్యక్తులే ఉన్నారు. పాజిటివ్ రేటు క్రమేణా పెరుగుతుండడంపై ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రామీణ ప్రాంతాల్లో విజృంభించకముందే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ టీకాల పంపిణీని ప్రారంభించారు. పల్లెల్లో ఇంటింటికీ తిరుగుతూ టీకాలపై అవగాహన కల్పించనున్నారు.