CPI Narayana : మునుగోడులో బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు-నారాయణ
బీజేపీని ఓడించేందుకే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు చెప్పారు నారాయణ. మునుగోడు విషయంలో కాంగ్రెస్ కన్ ఫ్యూజన్ లో ఉందన్నారాయన.
CPI Narayana : తెలంగాణ సీఎం కేసీఆర్ నయా నిజాం అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. నిజాం అన్న వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకోబోనని తేల్చి చెప్పారు. ఇక.. బీజేపీని ఓడించేందుకే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు చెప్పారు నారాయణ. మునుగోడు విషయంలో కాంగ్రెస్ కన్ ఫ్యూజన్ లో ఉందన్నారాయన.
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్కు కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మద్దతు ప్రకటించింది. ఇందుకు గల కారణాలను నారాయణ వివరించారు. దేశవ్యాప్తంగా తాము కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతున్నామని ఆయన చెప్పారు. అయితే మునుగోడులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని నిర్ణయించామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కొంప సరిగా లేని కారణంగానే మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించామని నారాయణ తెలిపారు. భవిష్యత్తు రాజకీయాలకు ఏ ఒక్కరూ భరోసా ఇవ్వలేరని నారాయణ అన్నారు.
ఆ సందర్భాన్ని బట్టి, కేసీఆర్ వ్యవహరించిన తీరును బట్టి మేము విమర్శించాం. కేసీఆర్ ను నయా నిజాం అని అన్నాం. ఇప్పుడే కాదు భవిష్యత్ లోనూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే విమర్శించి తీరుతాం. నిలబెట్టి నిలేస్తాం. అందులో ఎలాంటి మొహమాటం లేదు. కేసీఆర్ ను నయా నిజాం అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏమన్నారో దాని ప్రకారం నేను మాట్లాడాను. నేను దానిపై నిలబడి ఉన్నా. అదే పర్మినెంట్ గా ఉంటుందని చెప్పలేను. రేపు మంచి పనులు చేస్తే అప్పుడు కూడా తిడతామా? ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తుకు ఎవరూ హామీ ఇవ్వరు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు.