రూ.5లక్షలకే రైల్వే ఉద్యోగం… ఘరానా మోసం

రూ.5లక్షలకే రైల్వే ఉద్యోగం… ఘరానా మోసం

cyberabad police arrest gang cheating railway jobs: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పైగా మంచి శాలరీ.. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు. సరిగ్గా ఈ వీక్ నెస్ ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకున్నారు. నిరుద్యోగులను నిండా ముంచేశారు. తమ జేబులు నింపుకున్నారు.

రైల్వే శాఖలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠా ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసుకుని రూ.లక్షలు వసూలు చేసి, నకిలీ పోస్టింగ్‌ ఉత్తర్వులతో నిరుద్యోగులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్వేష్‌ సాహూ అలియాస్‌ అశోక్‌కుమార్‌ సింగ్‌ ఎంబీఏ చదివాడు. విజయవాడ సనత్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ మాజిద్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ (26), మిశ్ర (దిల్లీ), దినేష్‌ (కోల్‌కతా)తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. రైల్వేలో టీసీ, ట్రాక్‌మెన్‌ తదితర ఉద్యోగాలిప్పిస్తామంటూ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సోషల్‌మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆసక్తి చూపిన వారికి వాట్సప్‌లో లింక్‌ పంపించి.. అందులో వివరాలు నమోదు చేసుకున్న వారు ఢిల్లీలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్వాన్స్‌గా రూ.50 వేలు చెల్లించాలని కండిషన్‌ విధించాడు.

ముందుగా రూ.50వేలు కట్టిన వారిని ఢిల్లీకి తీసుకెళ్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాడు. ఢిల్లీలో పని చేయాలనుకుంటే పహాడ్‌గంజ్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో మిశ్రాను, సౌత్‌లో అయితే ఖరగ్‌పూర్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో దినేష్‌ను కలవాలని బాధితులకు చెప్పాడు. వారందరికీ ఆఫర్ లెటర్ పంపించి.. మరో రూ.2లక్షలిస్తే ట్రైనింగ్‌కు పంపిస్తామని నమ్మించాడు. డబ్బు ఇచ్చిన అభ్యర్థులను బ్యాచులుగా పశ్చిమ బెంగాల్‌, దిల్లీ ప్రాంతాల్లో ‘రైల్వే ప్రాంతీయ శిక్షణ కేంద్రం’ పేరిట మూడు నెలల పాటు శిక్షణ ఇప్పించాడు.

కొద్దిరోజుల తర్వాత రూ.3 లక్షలు తీసుకుని ఢిల్లీకి రావాలని వారికి సూచించాడు. అక్కడికి వచ్చిన వారి నుంచి డబ్బు తీసుకుని నకిలీ ఐడీ కార్డు, పత్రాలను అందజేసి రెండు రోజుల తర్వాత ఢిల్లీలోని రైల్వే ప్రధాన కార్యాలయంలో సంప్రదించమని చెప్పాడు.

దీంతో బాధితులు ఆఫర్ లెటర్లు తీసుకుని రైల్వే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దాంతో మోసం బయటపడింది. ఈ ముఠాకు రూ.6.3లక్షలు చెల్లించి మోసపోయానంటూ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బాధితులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శంషాబాద్‌ ఎస్వోటీ పోలీసులు ఢిల్లీ, కోల్‌కతా, విజయవాడ నగరాల్లో గాలించి సర్వేష్‌ సాహూ, అబ్దుల్‌ మాజీద్‌లను అరెస్ట్‌ చేశారు. మిశ్ర, దినేష్‌ పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ముఠా నాలుగైదేళ్లుగా వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిందని, ఈ వ్యవహారంలో రైల్వే ఉద్యోగుల పాత్రపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్నో ఏళ్లు కష్టపడి చదివితేనే గవర్నమెంట్ కాదు కదా ప్రైవేట్ ఉద్యోగాలు రావడం కూడా కష్టంగా మారిన ఈ రోజుల్లో, ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం డబ్బిస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే.. కచ్చితంగా మోసం అనే చెప్పాలి. ఇలాంటి మాయ మాటలు నమ్మొద్దని పోలీసులు సూచించారు. డబ్బిస్తే జాబ్ ఇస్తామని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి వ్యక్తుల మీకు తారసపడితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. మధ్యవర్తులను నమ్మితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.