Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ ప్రమేయం-బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.

Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ ప్రమేయం-బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ స్కామ్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది బీజేపీ. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు.

లిక్కర్ స్కామ్ లో ఉన్న వారంతా కేసీఆర్ కుటుంబ బినామీలే అని ఆయన ఆరోపణలు చేశారు. తెలంగాణలో మద్యం తయారు చేసి పంజాబ్ లో అమ్ముతున్నారని బండి సంజయ్ అన్నారు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తెచ్చి తెలంగాణలో అమ్ముతున్నారని చెప్పారు. ప్రశ్నించకుండా ఉండేందుకు యువతను మద్యానికి బానిసలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. లిక్కర్ స్కామ్ లో తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నారని బండి సంజయ్ అన్నారు. లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉన్న రామకృష్ణ పిళ్లై, అభిషేక్ తో కేసీఆర్ కుటుంబసభ్యులకు సంబంధాలు ఉన్నాయా? లేవా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉందని, కేసీఆర్ కూతురు కవిత హస్తం ఉందని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని బీజేపీ ఎంపీ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా మరింత సంచలనం రేపింది.

ఈ ఆరోపణల నేపథ్యంలోనే కవిత మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ అయిన తనను బద్నాం చేస్తే… కేసీఆర్ ఆగమవుతారనే యోచనతో ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. తమ లైన్ లోకి కేసీఆర్ వస్తారనే యోచనతో ఇది చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బట్ట కాల్చి మీద వేయాలనుకుంటున్నారని, తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని కవిత అన్నారు. కక్షపూరితంగానే బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను తన తండ్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని.. దీన్ని ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదన్నారు. ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చనీ, దేనికైనా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. బీజేపీపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కవిత తేల్చి చెప్పారు.