TTD: శ్రీవారి లడ్డూలపై ఆ ప్రచారం నమ్మొద్దు.. టీటీడీ ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదమైన లడ్డూపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
TTD: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. తాజాగా ఈ లడ్డూలపై ఒక అబద్ధపు ప్రచారం మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అందించే లడ్డూ ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని టీటీడీ తెలిపింది.
ఈ అంశంపై తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. టీటీడీ వెబ్సైట్ ద్వారా భక్తులు దర్శన టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో మాత్రమే ఆన్లైన్లో అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉందని, దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రకటించింది. అవసరమైతే ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.