Jupally Krishna Rao: అందుకే కేసీఆర్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి తన దెబ్బ రుచి చూపించాలి: జూపల్లి కృష్ణారావు
కారును గుద్దుడు గుద్దితే అప్పడం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల సినిమా ఇప్పుడు ఎండ్ కావడానికి వచ్చిందని చెప్పారు.
![Jupally Krishna Rao: అందుకే కేసీఆర్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి తన దెబ్బ రుచి చూపించాలి: జూపల్లి కృష్ణారావు Jupally Krishna Rao: అందుకే కేసీఆర్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి తన దెబ్బ రుచి చూపించాలి: జూపల్లి కృష్ణారావు](https://10tv.in/wp-content/uploads/2023/08/New-Project-2023-08-22T152359.220.jpg)
Jupally Krishna Rao
Jupally Krishna Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్లో జూపల్లి కృష్ణారావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.
మంత్రి హరీశ్ రావు గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు డబ్బా పెట్టె స్లిప్పర్ చెప్పులు అన్నారని జూపల్లి కృష్ణారావు చెప్పారు. అటువంటి హరీశ్ రావుకి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. మైనంపల్లి చెప్పిందంతా అసత్యం అన్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మైనంపల్లి హన్మంతరావు తిరుపతి వెంకటేశ్వరుడి సాక్షిగా మాట్లాడారని చెప్పారు.
కేసీఆర్కి మైనంపల్లి తన దెబ్బ రుచి చూపించాలని జూపల్లి కృష్ణారావు అన్నారు. అలాగే, పట్నం మహేందర్ రెడ్డికి తానొక విజ్ఞప్తి చేస్తున్నాననివ, పట్నం పౌరుషం చూపించాలని, కేసీఆర్ దిమ్మ తిరగాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు ఆ గేట్లు తెరుచుకోవని విమర్శించారు.
కేసీఆర్ గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారని, దీంతో ఓటమిని అంగీకరించినట్లేనని చెప్పారు. గత మ్యానిఫెస్టోను ఎందుకు అమలు చేయని కేసీఆర్ ఇప్పుడు అక్టోబర్ 16న భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని చెబుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల సినిమా ఇప్పుడు ఎండ్ కావడానికి వచ్చిందని, కారును గుద్దుడు గుద్దితే అప్పడం అవుతుందని అన్నారు. కేసీఆర్ అంత అర్భాటంగా ఏకంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినంత మాత్రాన ప్రజలకు ఏం ప్రయోజనమని జూపల్లి కృష్ణారావు నిలదీశారు. ఆ నేతలు అందరూ గతంలోనూ పోటీ చేశారని అయినా ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. వారంతా ఎటువంటివారో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయిందని చెప్పారు.