Sanjay: ప్రజా సంగ్రామ పాదయాత్ర.. అధికారమే లక్ష్యంగా అడుగులు
2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
Praja Sangrama Padayatra: 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం(28 ఆగస్ట్ 2021) నుంచి ఆరంభమైంది. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్టనున్నారు.
తొలిరోజు కళాబృందాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించేందుకు కరీంనగర్ నుంచి డోలు వాయిద్యాలు, డప్పు నృత్యాలు, అశ్వదళాల ప్రదర్శన లాంటి ఏర్పాట్లు చేశారు. 36రోజుల పాటు జరగనున్న యాత్ర అక్టోబర్ 2వరకూ జరుగుతుంది.
నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన విముక్తి కోసం సంగ్రామం చేస్తామంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. నాలుగు నుంచి ఐదు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగనుంది. మొదటి విడతలో 35 రోజులు కొనసాగనుంది. ఉదయం 9గంటల 30నిమిషాలకు పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, డీకే అరుణ, అరవింద్, సోయం బాబురావు, రాజాసింగ్ తదితరులు హాజరయ్యారు.
మొదటి రోజు చార్మినార్ నుంచి నాంపల్లి, లక్డీకపూల్ మీదుగా మొహిదీపట్నం వరకు పాదయాత్ర సాగనుంది. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భోజన వసతి ఏర్పాటు చేశారు. మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో మొదటి రోజు బసచేయనున్నారు. మొదటి విడతలో అక్టోబర్ 2న పాదయాత్ర ముగియనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలే లక్ష్యంగా మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర సాగనుంది.