RTC, Electricity Charges : కరెంట్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం

తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతోపాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తోంది.

RTC, Electricity Charges : కరెంట్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం

Rtc Power Charges Hike

RTC, Electricity Charges : తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతోపాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తోంది. అటు ఆర్టీసీ, ఇటు విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ దీనిపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కేబినేట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా శాఖలకు తెలిపారు సీఎం కేసీఆర్‌. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, ఆర్టీసీ పరిస్థితి మూలిగే
నక్కమీద  తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

లాక్ డౌన్ల వల్ల ఆర్టీసీ సంస్థ సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిందని ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం హైదరాబాద్‌లోనే నెలకు 90 కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని సీఎంకు తెలిపారు అధికారులు.  తెలంగాణలోని మొత్తం 97 డిపోలు నష్టాల్లోనే నడుస్తున్నాయ్‌. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు అధికారులు.

ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌కు రవాణాశాఖ మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టి,  కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. అది ప్రారంభమైన సమయంలోనే కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
Also Read : Google Play Store : 8 లక్షల యాప్‌‌ ల‌ను నిషేధించిన గూగుల్, యాపిల్

అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం. గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని, కాగా కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే, ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తోందని.. ఇంకా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనుకోవడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్ ధరల ప్రభావంనుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని  అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రావాలని ఆదేశించారు. అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సీఎం కేసీఆర్.