వేద వ్యవసాయంపై రామకృష్ణ మఠం వెబినార్
VEDIC AGRICULTURE FOR RESURGENT INDIA హైదరాబాద్ లోని రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(VIHE) 21వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతిష్టిత వ్యక్తులతో వెబినార్లు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు రిసర్జంట్ ఇండియా పేరుతో ‘వేద వ్యవసాయం’పై వెబినార్ నిర్వహించేందుకు రెడీ అయింది. ఈ నెల 18న ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది.
ఈ కార్యక్రమంలో కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ముఖ్యవక్తగా పాల్గొంటారని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. మరో వక్తగా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ బాలాజీ సుకుమార్ పాల్గొంటారు. వెబినార్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామి బోధమయానంద కోరారు.
కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్… ప్రస్తుతం భారతీయ వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో ఆయన కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) పండిస్తున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం విభాగానికి చెందిన కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఇటీవలే కౌటిల్య సాగుచేస్తున్న పొలాన్ని సందర్శించారు. కృషి భారతం ఆధ్వర్యంలో జరుగుతోన్న ప్రయోగాలను ప్రశంసించారు. కృష్ణ బియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగం ప్రాధాన్యం ఇవ్వాలని కౌటిల్య కృష్ణన్ కోరుతున్నారు.