YS Jagan Mohan Reddy : కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటే నమ్ముతారా? చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
CM Jagan Slams Chandrababu : 14ఏళ్లు సీఎంగా ఉన్నా కనీసం ఒక మంచి పని చెయ్యలేదు. కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకురాలేదు. కనీసం ఒక మంచి కార్యక్రమైనా అమలు చేయలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం కురిపించారు. 14ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఏనాడూ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో మహా సంగ్రామం జరగబోతోందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జగన్ సూచించారు. గత చంద్రబాబు పాలనను ఇప్పటి వైసీపీ పాలనను బేరీజు వేసుకోవాలన్నారు.
సంక్షేమమే ధ్యేయం..
”సాకులు వెతకలేదు, చెప్పలేదు. మీ అవసరాలు, మీ కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు, ఖర్చులకన్నా మిన్నగా భావించి మీ బిడ్డ ప్రభుత్వం మీ అందరికి కూడా తోడు నిలబడగలిగిందని చెప్పడానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదు. కష్టకాలంలోనూ అభివృద్ధి ఆపలేదు అని చెప్పడానికి గర్వపడుతున్నా.
వచ్చేది మహాసంగ్రామం..
చంద్రబాబు గత పాలనను ఓసారి గమనించండి. మహాసంగ్రామం రాబోతోంది. మహాసంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. గత పాలన ఎలా జరిగింది? గత పాలకులు ఎలా పని చేశారు? ఎంత పని చేశారు? మనకు మంచి చేశారా లేదా? అన్నది ఆలోచన చేయాలి. గత పాలనకు మీ బిడ్డ పాలనకు మధ్య బేరీజు వేయాల్సిన సమయం వచ్చింది.
Also Read : చంద్రబాబుకు గుండె సమస్య, 5 వారాల రెస్ట్ అవసరం.. హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత
బాబుది మోసాల పాలన.. కుప్పంకు ఏం చేశారు?
చంద్రబాబు పాలనలో మనం మోసాల చరిత్రను చూశాం. వెన్నుపోట్ల చరిత్రను చూశాం. అబద్దాల చరిత్ర మనకు కనిపించింది. 14ఏళ్లు సీఎంగా ఉన్నా కనీసం ఒక మంచి పని చెయ్యలేదు. కనీసం ఒక మంచి స్కీమ్ తీసుకురాలేదు. కనీసం ఒక మంచి కార్యక్రమైనా అమలు చేయలేదు. 34ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా తన సొంత నియోజకవర్గమైన కుప్పంకి కనీసం నీరు కూడా ఇవ్వలేదు. మాచర్ల, పల్నాడుకు చంద్రబాబు నీళ్లు ఇస్తానని చెబితే నమ్మగలరా? అని అడుగుతున్నా. కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తా అని చెప్పాడట. అట్లుంది చంద్రబాబు తీరు.
వెన్నుపోటు బాబు..
సొంత కూతురిని ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు ఇక రాష్ట్రంలోని కోటి 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? ఈ పెద్ద మనిషి చంద్రబాబు అమరావతిని ఒక రాజధానిగా ఒక భ్రమ కల్పించాడు. మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే సమన్యాయం జరగుతుందన్న నమ్మకం ఎవరికైనా ఉందా? ఇలాంటి పెద్ద మనిషి రేపు పొద్దున నేను మారాను. భవిష్యత్తులో నేను ఇవన్నీ చేస్తాను అని అంటే మీరు నమ్మగలరా?” అని నిప్పులు చెరిగారు సీఎం జగన్.