Bandla Ganesh : ఇది ధర్మమా..! వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయంపై బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్..

విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బండ్ల గణేశ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Bandla Ganesh : ఇది ధర్మమా..! వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయంపై బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్..

Updated On : January 24, 2025 / 8:13 PM IST

Bandla Ganesh : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన సంచలన ప్రకటన ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయసాయిరెడ్డి అనూహ్య నిర్ణయం రాజకీయ నాయకులనే కాదు సామాన్యులను సైతం విస్మయానికి గురి చేసింది. ఇదిలా ఉంటే, విజయసాయిరెడ్డి నిర్ణయంపై బండ్ల గణేశ్ స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

”అధికారం ఉన్నప్పుడు అనుభవించి.. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్ళిపోవడం చాలామంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయింది.. ఇది ధర్మమా..” అని బండ్ల గణేశ్ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బండ్ల గణేశ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు..
కాగా, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదన్నారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి తాను పదవికి రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. తనను ఎవరూ ప్రభావితం చెయ్యలేదని క్లారిటీ ఇచ్చారు.

జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా..
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కి, తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన భారతికి సదా కృతజ్ఞుడిని అని అన్నారు. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు..
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పుకొచ్చారు. దాదాపు తొమ్మిదేళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనో ధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవు, పవన్ తో చిరకాల స్నేహం ఉంది..
టీడీపీతో రాజకీయంగా విభేదించాను తప్ప.. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇక, జనసేనాని పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నారు. ఇకపై నా భవిష్యత్తు వ్యవసాయం అని కీలక ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకు, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

 

Also Read : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్ బై..!