గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. 12 పెట్టెల్లో రూ.11 కోట్లు.. ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం..
ఇవాళ, రేపు మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిపే అవకాశం ఉంది. నగదు సీజ్ విషయంలో చాణక్య, వినయ్ పాత్రపై కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో రూ.11 కోట్ల నగదును దాచగా, వాటిని అధికారులు సీజ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా, కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో ఈ డబ్బును అధికారులు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ 40గా ఉన్న వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. వరుణ్ నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్కు రాగానే అరెస్టైన విషయం తెలిసిందే. నగదు సీజ్ విషయంలో చాణక్య, వినయ్ పాత్రపై కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Also Read: రష్యాలో భయంకరమైన భూకంపం.. రష్యా, జపాన్లో సునామీ.. అమెరికా, చైనాలోనూ హెచ్చరికలు జారీ..
మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన డబ్బు చివరికి ఎక్కడికి చేరిందో తేల్చడంలో భాగంగా ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డిని కూడా అధికారులు ప్రశ్నించారు. అతడితో పాటు చాణక్య ఆదేశాల మేరకు గత ఏడాది జూన్లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న ఈ 12 బాక్సులను కార్యాల ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ గుర్తించింది.
సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ ఓనర్ పేరు విజయేందర్రెడ్డిగా అధికారులు గుర్తించారు. ఆయన తల్లి పేరే సులోచన. ఆమె పేరునే ఫామ్హౌస్కి పెట్టారు. ఇందులోని స్టోర్ రూమ్లో బియ్యం బస్తాల మధ్య బాక్సులు పెట్టారు. అందులోనే డబ్బు లభ్యమైంది. కాగా, లిక్కర్ స్కామ్లో సుమారు రూ.3500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించింది. ఇవాళ, రేపు మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిపే అవకాశం ఉంది.