Andhra Pradesh SAAP: “హు ఆర్ యూ”.. అంటూ బైరెడ్డిపై కేపీ రావు ఆగ్రహం.. క్రీడా సంఘాల భేటీలో రచ్చ రచ్చ
ఏపీ క్రీడా సంఘాల సమావేశం రచ్చ రచ్చగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కేపీ రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి రోజా సమక్షంలోనే గొడవపడ్డారు.

Andhra Pradesh SAAP
Andhra Pradesh SAAP: విజయవాడలో మంత్రి రోజా (Minister Roja) సమక్షంలో జరిగిన ఏపీ క్రీడా సంఘాల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ-శాప్ (Andhra Pradesh SAAP) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy siddharth Reddy), అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు. శాప్ మీటింగ్ మధ్యలో స్పీచ్ ల విషయంలో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదం జరిగింది. ఇక్కడ వివాదాలు పెట్టుకోవడానికి మీటింగ్ పెట్టలేదని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు.
దీంతో బైరెడ్డిని “హూ ఆర్ యూ?” అని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కేపీ రావు (KP Rao) ప్రశ్నించారు. రాయలసీమ రాజకీయాలు చేయొద్దని కేపీ రావు అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు బైరెడ్డి. అలాగే, ఆయన అనుచరులు, వివిధ అసోసియేషన్ల సభ్యులు కేపీ రావుపై మండిపడ్డారు. కేపీ రావుకి, బైరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
చివరకు మంత్రి రోజా, బైరెడ్డి కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మనస్తాపంతో కేపీ రావు బయటకు వెళ్లిపోయారు. ఈ వివాదంపై బైరెడ్డి స్పందించారు. వివాదాలు పరిష్కరించుకోవాలని అన్ని అసోసియేషన్లను పిలిచామని చెప్పారు. కొందరు కావాలని రెచ్చగొట్టాలని చూశారని అన్నారు. ఏపీలో స్పోర్ట్స్ సర్వనాశనం కావడానికి కారకులు ఎవరో తమకు తెలుసు అని వ్యాఖ్యానించారు. కాగా, అసోసియేషన్ల మధ్య వివాదాలు పరిష్కరించుకోవాలని, క్రీడాకారులను ఇబ్బందులు పెట్టవద్దని శాప్ సూచనలు చేసింది.