Annadata Sukhibhava: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.20,000.. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటన..
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం అని చెప్పాం.

Annadata Sukhibhava: ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. అందులో కీలకమైన వాటిలో రైతుభరోసా (అన్నదాత సుఖీభవ) ఒకటి. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తోంది.
ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి. ఇక, కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా స్కీమ్ లు అమల్లోకి రానున్నాయి. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు 20వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం.
తాజాగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారాయన. రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిధ్ధంగా ఉందన్నారు చంద్రబాబు. త్వరలో రైతు భరోసా (అన్నదాత సుఖీభవ) అమలు చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం అందించే 6వేలతో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు చెల్లిస్తామన్నారు.
Also Read : ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతుంటే.. జగన్ ఇకపై రారుగా అని అందరూ అడుగుతున్నారు- నారా లోకేశ్
”అన్నదాత సుఖీభవ రైతుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయం. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుంది” అని చంద్రబాబు చెప్పారు.
”ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం అని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అలాగే, త్వరలో రైతుభరోసా అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 20వేల రూపాయలు ఇస్తాం. ప్రతి రైతుకు రైతుభరోసా కింద 20వేలు ఇస్తాం.
కేంద్రం 6 వేలు ఇస్తుంది. మనం 14వేలు ఇస్తాం. రెండూ మ్యాచ్ చేసి 20వేలు ఇస్తాం. ఇక మత్స్యకారులకు 20వేలు ఇస్తామన్నాం. చేపల వేటకు వెళ్లని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా హాలీడే ఇస్తాం. ఆ హాలీడే సమయం ముందుగానే వారికి ఇవ్వాల్సిన 20వేల రూపాయల ఆర్థిక సాయం చేసి వారిని కూడా ఆదుకుంటాం.
ఇప్పటికే డీఎస్సీ అనౌన్స్ చేశాం. త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇచ్చిన హామీ మేరకు 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. రాబోయే సంవత్సరం 16వేల 384 ఉద్యోగాలు రిక్రూట్ చేసి, ట్రైనింగ్ చేసి, పోస్టింగ్స్ ఇచ్చి, స్కూల్స్ ఓపెన్ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తాం” అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు చంద్రబాబు.
Also Read : ఆ జబ్బులున్న వారు ఉపవాసం ఉండొచ్చా? ఫాస్టింగ్ తర్వాత వెంటనే తినాల్సిన ఆహారం ఏంటి..
‘పేదరికం లేని సమాజమే మా లక్ష్యం. ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం. ఉగాది రోజున పీ-4 విధానాన్ని ఆవిష్కరిస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ పూర్తి చేశాం. తాజా పెట్టుబడుల ద్వారా 5లక్షల ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
మరోవైపు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై మండలిలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్, మే మాసాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నామని కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకు రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు నారా లోకేశ్. గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా ఏడాదికి రూ.250 చొప్పున పెంచిందని లోకేశ్ ధ్వజమెత్తారు.