Tirupati by-election : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై జగన్ స్పెషల్ ఫోకస్..
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడమే భాగంగా పావులు కదుపుతోంది.

Tirupati Lok Sabha By Election
Tirupati Lok Sabha by-election : తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడమే భాగంగా పావులు కదుపుతోంది. తిరుపతి ఎంపీ సీటును గెలిచి.. ప్రతిపక్షాలకు సవాల్ విసరాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ అధినేత, ఏపీ సీఎం.. జగన్ తిరుపతి బైపోల్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికలపై చర్చించనున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నారు.
ఏపీలో జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల విజయాలతో వైసీపీ జోష్ మీద ఉంది. పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ క్లీన్స్విప్ చేసింది. తాడిపత్రి మినహా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఊపులో తిరుపతి లోక్సభను కూడా గెలిచి తీరాలను టార్గెట్గా పెట్టుకుంది. ఈ విజయంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదన్న సంకేతాన్ని ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది.
తిరుపతి పార్లమెంట్ బైపోల్ను వైసీపీతోపాటు టీడీపీ, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తిరుపతి ఎంపీ స్థానాన్ని గెలిచి పరువు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తోంది. అటు బీజేపీ కూడా తిరుపతి విజయంతో…. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ఇవ్వాలని చూస్తోంది. కాంగ్రెస్ కూడా తిరుపతి స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
వైసీపీ ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించింది. ఉన్నత విద్యావంతుడు కావడంతో ప్రజలు గురుమూర్తిని ఆదరిస్తారని జగన్ భావిస్తున్నారు. వెంటనే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఇప్పటికే పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. ఇవాళ స్వయంగా సీఎం జగనే . పార్టీ నాయకులతో భేటీ అవుతుండడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.