Vijayasai Reddy: పాపం.. పెద్దాయనను లాగిపడేశారే: పురంధేశ్వరిపై విజయసాయి ఆరోపణలు
73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని.. శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Even the enemy does not want such a daughter Vijayasai Reddy coment on Purandeswari
Vijayasai Reddy coment on Purandeswari: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల దాడి కొనసాగుతోంది. పురంధేశ్వరి తన కులం, కుటుంబం కోసమే రాజకీయాలు చేస్తున్నారని తాజాగా ఆయన ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఎక్స్(ట్విటర్)లో విమర్శించారు. గత కొద్ది రోజులుగా పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి వరుసగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. టీడీపీతో బీజేపీకి పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి సైకిల్ పార్టీని తలకెత్తుకున్నారని వ్యాఖ్యానించారు. బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సహకారంతో ఎంపీగా గెలిచి బిబీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబుపై ఈగ కూడా వాలనీయడం లేదని సెటైర్ వేశారు.
ఎన్టీఆర్ చివరి రోజుల్లో తన తండ్రిని పురందేశ్వరి పట్టించుకోలేదని, ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ కష్టపడి సాధించుకున్న అధికారాన్ని చంద్రబాబుతో చేతులు కలిపి 8 నెలలు కూడా తిరక్కుండానే లాక్కున్నారని గుర్తు చేశారు. 73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారని.. శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. స్వార్ధ ప్రయోజనాలే లక్ష్యంగా కులం, కుటుంబం చుట్టే పురంధేశ్వరి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిద్దాంతం, విధానం, ధర్మం, న్యాయం ఏమీ లేకుండా స్వార్థంతో పనిచేస్తున్నారని, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందునే..
కాగా, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తున్నందునే తమపై వైసీపీ సర్కారు ఎదురుదాడి చేయిస్తోందని పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వ పాలనలో విధానపరమైన లోపాలను ఎత్తి చూపిస్తే టీడీపీ కోవర్ట్ అంటూ నిందలు వేస్తున్నారని వాపోయారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని తీవ్రంగా విమర్శించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ.. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెపై విజయసాయిరెడ్డి వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Also Read: ఎలాంటి కేసులైనా పెట్టుకోండి, భయపడను.. నా వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారు
ప్రజలు విధించే శిక్షకు సిద్ధంగా ఉండండి
తమ పార్టీ అధ్యక్షురాలిపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై తమ అధ్యక్షురాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని వైసీపీ ప్రజలు విధించబోయే శిక్షకు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి అన్నారు. చవకబారు మద్యంలాగానే, వైసీపీ సర్కారు చవకబారు మాటలు ఉన్నాయని.. చిత్తశుద్ధి ఉంటే తమ అధ్యక్షురాలు ప్రశ్నించిన దశలవారీ మద్య నిషేధం హామీ ఎప్పుడు నెరవేరుస్తారో సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఆర్ డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డి ట్వీట్స్
ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి…పాపం! 73 ఏళ్ల వయస్సులో…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2023
పురందేశ్వరి గారు…
కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు…మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే. మీ అంతిమ లక్ష్యం కుల “ఉద్దారణే”. మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు…స్వార్థం తప్ప.…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2023