Fake notes: పొలంలో రూ.500 నోట్ల కట్టలు.. వాటిని పట్టుకుని చూస్తే షాక్..
దాదాపు 40 కట్టలు ఒకే దగ్గర పడి ఉన్నాయి.

ఓ పొలంలో నోట్ల కట్టలు కనపడ్డాయి. అయితే, ఎంతో ఆశతో వాటిని పట్టుకుని చూసిన రైతులు.. ఆ నోట్ల కట్టలన్నీ నకిలీవని తెలియడంతో షాక్కు గురయ్యారు. ఆ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాకుండా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది.
ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో చోటుచేసుకుంది. నార్కట్పల్లి, అద్దంకి రహదారి వద్ద బొత్తలపాలెం వద్ద పొలాలు ఉంటాయి. అక్కడి ఓ రైతు పొలంలో రూ.500 నోట్ల కట్టలు కనపడ్డాయి.
దాదాపు 40 కట్టలు ఒకే దగ్గర పడి ఉన్నాయి. వాటిని స్థానిక రైతులు గుర్తించి, అవి నిజమైన నోట్లే అనుకుని వాటిలో కొన్నింటిని చప్పుడు చేయకుండా తీసుకెళ్లారు. అయితే, ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.
మిర్యాలగూడ గ్రామీణ సీఐ వీరబాబు ఆ పొలం వద్దకు వెళ్లి అక్కడ మిగిలి ఉన్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న నోట్లన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? వాటిని ఎందుకు ముద్రించారు? అన్న వివరాలను తేల్చేందుకు దర్యాప్తు జరుపుతున్నారు.