శివరాత్రి వేళ గుడికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి… ముగ్గురు మృతి.. చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి.. రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా
శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో పలువురిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోనలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శివరాత్రి సందర్భంగా వై.కోటకు చెందిన పలువురు భక్తులు ఆలయానికి వెళ్తున్న సమయంలో ఏనుగుల దాడి జరిగింది. మృతుల పేర్లు వి.దినేశ్, టి.మణమ్మ, చంగల్ రాయుడని అధికారులు తెలిపారు.
ఏనుగుల దాడిలో భక్తుల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
ఏనుగుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగాన్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు.
Also Read: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?