రుషికొండ భవనాలపై టీడీపీ తప్పుడు ప్రచారం: గుడివాడ అమరనాథ్

రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని, నాలుగు నెలల క్రితమే వీటిని ప్రారంభించామని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ తెలిపారు.

రుషికొండ భవనాలపై టీడీపీ తప్పుడు ప్రచారం: గుడివాడ అమరనాథ్

gudivada amarnath

Updated On : June 17, 2024 / 2:38 PM IST

Rushikonda Building: విశాఖపట్నంలోని రుషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టిడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సీఎం జగన్ సొంత భవనాల్లగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని, నాలుగు నెలల క్రితమే వీటిని ప్రారంభించామని తెలిపారు. రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఏమీ ఉండరని స్పష్టం చేశారు. రుషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను కూడా బయటపెడితే బాగుండేదన్నారు.

”విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. హైదారాబాద్ లో ఇల్లు నిర్మించుకునే సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్ ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు.

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్..! ఏపీలో అందుబాటులోకి రానున్న బ్రాండెడ్ మద్యం..!

అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలని టీడీపీ నేతలు గుర్తించాలి. రుషికొండకు ఎదురుగా గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేద”ని గుడివాడ అమరనాథ్ అన్నారు.