Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు కుండపోత..
దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు 19 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు అధికారులు. తదుపరి సూచన ఇచ్చే వరకు వేచి చూడాలని కోరారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్న కారణంగా తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి. రానున్న 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.