Pastor Pagadala Praveen : పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీ.. విజయవాడలో ఆ మూడు గంటలు ఆయన ఎక్కడున్నారు? పోలీసులు ఏం చెప్పారంటే..
ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్యకు, రాజమండ్రికి చెందిన ఆకాశ్, జాన్ లకు మాత్రమే తెలుసు.

Pastor Pagadala Praveen : ఏపీలో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేశారు పోలీసులు. పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్టు గుర్తించామన్నారు. బంధువులు వచ్చిన తర్వాత కేసు రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశామని వెల్లడించారు.
ఈస్ట్ గోదావరి ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామన్నారు. నేరుగా ఈ కేసును సీఎం చంద్రబాబు మానిటర్ చేశారుని, జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని, ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేశారని ఐజీ చెప్పారు.
”ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. 1.29 కి చౌటుప్పల్ టోల్ గేట్ దాటారు. విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఎక్కడున్నారు అనే విషయం మీద ట్రాక్ చేస్తున్నాం. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11:40 చేరుకున్నారు. 11:42కు ఇన్సిడెంట్ జరిగింది. విజయవాడలో ఎక్కడున్నారు అనే అంశం మీద ట్రాక్ చేస్తున్నాము.
పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాలకు సంబంధించి సమాచారం వచ్చింది. చేతులు మీద ఫేస్ మీద కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. పూర్తి వివరాలు ఇవ్వలేదు. వివరాలు పూర్తిగా వచ్చిన తర్వాత ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కారు ఢీ కొడితే మోటార్ సైకిల్ డెంట్ పడిందా లేదా అన్న విషయాన్ని కూడా ట్రాన్స్ పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎటువంటి అసత్య ప్రచారాలు చేయవద్దు” అని ఐజీ అశోక్ కుమార్ అన్నారు.
నర్సింహ కిషోర్, జిల్లా ఎస్పీ
హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల డేటా కలెక్ట్ చేస్తాం. చౌటుప్పల్ టోల్ గేట్ వద్ద మధ్యాహ్నం 1.29కి ప్రవీణ్ మొదలయ్యారు. అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. ఒక్కొక్క సెకనుకు 15 ఫ్రేములు చొప్పున ఫుటేజ్ కూడా బయటకు తీసి పరిశీలించాము. రాజమండ్రి ఎందుకు వచ్చారో పరిశీలించాము.
లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట కొంత సైట్ కొనుగోలు చేశారు. ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్యకు, రాజమండ్రికి చెందిన ఆకాశ్, జాన్ లకు మాత్రమే తెలుసు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం.