Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు.
Minister Roja: తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా స్పందించారు. మంగళవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో సీఎం జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు. హతుడు సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులకు సీఎం జగన్ ఆదేశించారని రోజా తెలిపారు. సీఎం జగన్ దావోస్ పర్యటనలో చాలా కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారన్న రోజా ఏపీకి పదివేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంఓయూ చేసుకున్నట్లు తెలిపారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా ప్రజలకు భరోసా ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు.
పప్పు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ లోకేష్ నుద్దేశించి మంత్రి రోజా ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ పథకాలను మార్చి చంద్రబాబు పేరు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటికీ అన్నీ వర్గాలకు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని, జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. గడపగడపకూ ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆమె చెప్పారు. దేశంలో తొలిసారిగా ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్లేందుకు బయపడుతుంటే, అధికార పక్షం ప్రజల్లోకి వెళ్తోందని మంత్రి రోజా అన్నారు.
other stories:Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య