Rajya Sabha: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య.. టీడీపీ నుంచి ఎవరంటే?
మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు ..

Rajya Sabha BJP Candidate R Krishnaiah
AP BJP Rajya Sabha Candidate R Krishnaiah: మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు బీజేపీ అదిష్టానం అవకాశం కల్పించింది. మరో రెండు స్థానాలైన హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఆర్. కృష్ణయ్య గతంలో ఏపీలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ఉన్నప్పటికీ కృష్ణయ్య రాజీనామా చేశారు. తాజాగా బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కృష్ణయ్య ఎంపికయ్యారు.
Also Read: Manchu Family : మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హైడ్రామా.. మోహన్బాబు ఇంటికి చేరుకున్న బౌన్సర్లు..
దేశంలోని ఒడిశా, బెంగాల్, హర్యానా రాష్ట్రాలతోపాటు.. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే, రేపటితో నామినేషన్ల దాఖలకు సమయం పూర్తికానుంది. ఈ క్రమంలో బీజేపీ ఆర్. కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ నుంచి మరో ఇద్దరు రాజ్యసభకు వెళ్లనున్నారు. అయితే, వారి పేర్లను టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: Revanth Reddy: తెలంగాణ తల్లి రూపురేఖలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
టీడీపీ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పలువురు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో టీడీ జనార్ధన్, కంభంపాటి రామ్మోహన్, భాష్యం రామకృష్ణ, వర్ల రామయ్య, గల్లా జయదేవ్ చివరి వరకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, ఆశావహులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నచ్చజెప్పినట్లు సమాచారం. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్ పేర్లును చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ సాయంత్రానికి టీడీపీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.