టీడీపీలో కొనసాగుతున్న టికెట్ల పంచాయితీ.. చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం
అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం నెలకొంది.
![టీడీపీలో కొనసాగుతున్న టికెట్ల పంచాయితీ.. చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం టీడీపీలో కొనసాగుతున్న టికెట్ల పంచాయితీ.. చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం](https://10tv.in/wp-content/uploads/2024/02/Chandrababu-house.jpg)
Chandrababu house
Chandrababu Naidu : ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. రెండు రోజుల క్రితం టీడీపీ – జనసేన కూటమికి సంబంధించి మొదటి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. జాబితా విడుదల నాటి నుంచి ఏపీలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నిరసనలు మిన్నంటుతున్నాయి. టికెట్ దక్కని నేతల అనుచరులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read : శ్రీకాకుళానికి నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదు.. విజ్ఞతతో ఆలోచించాలి : ధర్మాన ప్రసాదరావు
అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం నెలకొంది. పార్టీలో చేరేందుకు అనుచరులతో ర్యాలీగా పార్థసారధి, బొప్పన భువకుమార్, తదితరులు వచ్చారు. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద తంబళ్లపల్లె టికెట్ ఆశించి భంగపడ్డ శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళనకు దిగారు. పార్దసారధి అనుచరులతో పాటు సెక్యూర్టీ గేట్ దాటుకుని శంకర్ యాదవ్ అనుచరులు లోపలకు వచ్చారు. దీంతో పోలీసులు వారిని ఆపలేక పోయారు. ఒక్కసారిగా లోపలకు రావడంతో చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తంబళ్లపల్లె టికెట్ ను శంకర్ యాదవ్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. తంబళ్లపల్లె టికెట్ దక్కించుకున్న జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి బినామీ అంటూ నినాదాలు చేశారు. కోవర్టులు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ నినాదాలు చేశారు.