Nallari Kiran Kumar Reddy : టీడీపీ కంటే దౌర్జన్యపూరితంగా జగన్ పాలన ఉంది, రాష్ట్రాన్ని నాశనం చేశారు- కిరణ్ కుమార్ రెడ్డి
Nallari Kiran Kumar Reddy : అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. విభజన కంటే.. ఎక్కువ నష్టం జిల్లాల విభజన వలన జరుగుతోంది.

Nallari Kiran Kumar Reddy
Nallari Kiran Kumar Reddy – YS Jagan : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ పాలన దారుణంగా ఉందన్నారు. టీడీపీ కంటే దౌర్జన్యపూరితంగా వైసీపీ ప్రభుత్వం పాలన ఉందని ధ్వజమెత్తారు. అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. అనంతపురంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు కిరణ్ కుమార్ రెడ్డి.
ప్రపంచ నాయకులంతా ఆయనను రాక్ స్టార్ అని పిలుస్తున్నారు:
‘ సామాన్యుల బాధలు ఎలా ఉంటాయో మోదీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే ఆయన పాలన సామాన్యుల పక్షాన సాగుతోంది. భారత్ మాతాకీ జై అన్న నినాదం.. ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ప్రపంచంలో ఏ నాయకుడికీ లేని గ్లామర్ మోదీకి ఉంది. ప్రపంచ నాయకులంతా ఆయనను రాక్ స్టార్ అని పిలుస్తున్నారు. దేశంలో అవినీతిని, కలుపు మొక్కలను ఏరి వేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత చంద్రబాబును ఓడించారు. జగన్ ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు.(Nallari Kiran Kumar Reddy)
అందుకే.. రాష్ట్ర విభజనను వ్యతిరేకించా:
మోడీ పాలనకు 9ఏళ్లు, రాష్ట్ర విభజనకు 9ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదు. హంద్రీనీవా, పోలవరం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కృష్ణా జలాల్లో అన్యాయం వలనే రాష్ట్ర విభజన జరిగింది. మన ప్రాజెక్టులు చాలా వరకు మిగులు జలాల మీదనే ఆధారపడ్డాయి. నీటి విషయంలో అన్యాయం జరుగుతుందనే విభజన వద్దన్నాను. ఏపీ, తెలంగాణకు మిగులు జలాలు జీవన్మరణ సమస్య.
రాష్ట్ర విభజన కంటే.. జిల్లా విభజనతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది:
రాజధాని విషయంలో 9 సంవత్సరాల తర్వాత కన్య్ఫూజన్ క్రియేట్ చేశారు. జిల్లాలను ఇష్ట మొచ్చినట్టు విభజన చేశారు. విభజన కంటే.. ఎక్కువ నష్టం జిల్లాల విభజన వలన జరుగుతోంది. 9 ఏళ్లు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. దేశ భవిష్యత్ కోసమే 8ఏళ్ల తర్వాత బీజేపీలో చేరాను. నేను చూడని పదవులు ఏమీ లేవు. కేవలం కార్యకర్తగానే బీజేపీలో ఉంటా. వివేకానంద రెడ్డి గురించి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి నాతో చెప్పే వారు. ఆయన మృతి ఇంత వివాదం కావడం చాలా బాధాకరం.
చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యావ్.. ఇలానేనా పాలించేది?
రాష్ట్రంలో వైసీపీ ఎంపీలు, నాయకులు కూడా ఉండలేమంటున్నారు. ఏంటీ పాలన? టీడీపీ కంటే దౌర్జన్యపూరితంగా పాలన సాగుతోంది. దేశం, రాష్ట్రం బాగుండాలంటే.. మోడీనే ఉండాలి. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యావ్ జగన్.. ఇలానేనా చేసేది? లంచం లేని వ్యవస్థలను తీసేసి.. కొత్త వాటిని తీసుకొచ్చారు.
నా పాలనలో లక్షా 70 వేల ప్రభుత్వ, 8లక్షల ప్రైవేట్ ఉద్యోగాలిచ్చాను. పాలన అంటే ఏంటో ప్రధాని మోదీని చూసి నేర్చుకోండి. యుక్రెయిన్ యుద్ధం వలనే ధరలు పెరిగాయి. ఇబ్బందులు ఉన్న మాట నిజమే. దేశం, రాష్ట్రం బాగుండాలంటే.. మోదీనే ఉండాలి. మీ భవిష్యత్తు గురించి మీరే ఆలోచించుకుని ఓటు వేయండి” అని ఓటర్లకు పిలుపునిచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి.(Nallari Kiran Kumar Reddy)