హైదరాబాద్‌లో భారీగా సెటిల్ అవుతున్న నార్త్ ఇండియన్స్.. మంచి వాతావరణం, వసతులతో ఆకర్షిస్తున్న భాగ్యనగరం

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో భారీగా సెటిల్ అవుతున్న నార్త్ ఇండియన్స్.. మంచి వాతావరణం, వసతులతో ఆకర్షిస్తున్న భాగ్యనగరం

how hyderabad destinations for north indians after retirement

Updated On : January 1, 2024 / 1:56 PM IST

Destination Hyderabad: హైదరాబాద్‌ అంటేనే ఓ మినీ ఇండియా. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో అన్ని ప్రాంతాలవారు నివసిస్తుంటారు. చక్కటి వాతావరణం, మంచి మౌలిక వసతులతో హైదరాబాద్‌ దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. వరల్డ్ లెవల్ టాప్ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఓపెన్ చేస్తున్నాయి. అలాంటి సిటిలో స్థిరనివాసంపై మరింత మక్కువ చూపుతున్నారు నార్త్ ఇండియన్స్. వాణిజ్య, వ్యాపారవేత్తలు నుంచి ఉన్నతాధికారుల వరకు కొనసాగుతున్న ఈ ట్రెండ్‌.. హైదరాబాద్ రియాలిటీకి మంచి బూస్ట్ ఇస్తోందంటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్స్‌.

హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉత్తమం
దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రధానమైంది. ఇక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధితోపాటు సిటీకి మంచి వాతావరణం ఉండటంతో హైదరాబాద్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చాలా మంది నగరానికి వస్తుంటారు. అలా వస్తున్నవాళ్లంతా సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి వాతావరణం, మౌలిక వసతులు, డెవలప్‌మెంట్‌, శాంతిభద్రతలు తదితర అంశాలు వారిని ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనంత అత్యున్నత ప్రమాణాలతో 69 కిలోమీటర్ల మెట్రో రైలు, పెద్ద సంఖ్యలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రావడంతో శివారు ప్రాంతాల్లోనూ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు లక్షల మంది ఆసక్తి చూపుతున్నారు.

స్థిరాస్తుల కొనుగోలుపై ఉత్తరాది వాసుల ఆసక్తి
హైదరాబాద్‌లో సొంతిళ్లు ఉండాలనే కోరిక తెలుగువాళ్లలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అవకాశమున్న చాలా మంది నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కోరిక ఇప్పుడు తెలుగువారి నుంచి నార్త్‌ ఇండియన్స్‌కు కూడా పెరిగింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు స్థిరాస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో ఎక్కువ అనుబంధం ఉన్న నార్త్ ఇండియన్స్ సిటీలో అనుకూలమైన చోట్ల ఇళ్లు, భూములు కొనేందుకు పోటీపడుతున్నారు. సౌత్ ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ ఉండటం, ఐటీతోపాటు ఇతర ఉపాధి సౌకర్యాలు మెరుగ్గా ఉండడం నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కారణమవుతోంది.

Also Read: హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్.. సిటీకి నాలుగు దిక్కుల ప్రత్యేక టౌన్‌షిప్స్‌

రియల్‌ ఎస్టేట్‌కు కలిసొచ్చే అంశం
ఇక హైదరాబాద్‌లో అన్ని వయస్సుల వారు సౌకర్యవంతంగా గడిపేలా అనుకూల వాతావరణం ఉంటుంది. నగరంలో సదుపాయాలు, అన్నిరకాల ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైల్ నెట్‌వర్క్‌తోపాటు ఎయిర్‌పోర్ట్‌ హైదరాబాద్‌కు అదనపు ఆస్తి. ఇలాంటి చాలా సౌకర్యాలు హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసేందుకు ప్రభావితం చేస్తున్నాయి. సిటీతో చాలా కాలం అనుబంధం ఉన్న ఉన్నతాధికారులు వాణిజ్య వ్యాపార వర్గాలకు చెందిన వారు పర్మినెంట్ హౌజ్‌ ఏర్పాటుచేసుకుంటున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ లింగ్డో, మాజీ CSలు ఎస్కే జోషి, సోమేశ్‌కుమార్‌ కూడా నగరంలోనే సొంతింటిని నిర్మించుకున్నారు. ఇలా హైదరాబాద్‌లో నార్త్ ఇండియన్స్ కూడా సొంత ఇళ్లు, ఆస్తులు కొనుగోలు చేయడం సిటి రియల్‌ ఎస్టేట్‌కు కలిసొచ్చే అంశంగా రియాల్టర్లు భావిస్తున్నారు.