PM SVANidhi Scheme : ఈ చిరు వ్యాపారులకు అదిరే స్కీమ్.. రూ.50వేల వరకు లోన్.. ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే?

PM SVANidhi Scheme : పీఎం స్వనిధి పథకానికి దరఖాస్తు చేసుకునే చిరు వ్యాపారులు నేరుగా (PM SWANidhi) పోర్టల్‌లో లేదా తమ ప్రాంతానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.

PM SVANidhi Scheme : ఈ చిరు వ్యాపారులకు అదిరే స్కీమ్.. రూ.50వేల వరకు లోన్.. ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే?

PM SVANidhi Scheme

Updated On : February 15, 2025 / 6:16 PM IST

PM SVANidhi Scheme : ప్రధాని మోదీ సర్కారు చిరు వ్యాపారుల కోసం అదిరిపోయే స్కీమ్ అందిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు నిరుపేదలకు ఎన్నో వరాలను అందిస్తోంది. చిరు వ్యాపారులు చాలామంది ఫుట్‌పాత్‌లపై వస్తువులను అమ్ముకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఈ చిన్నపాటి వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి (PM SVANidhi) అని కూడా పిలుస్తారు. దేశమంతటా ప్రతిఒక్కరూ సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని చేసుకునేలా ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశం. వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు అనేక పథకాలు, కార్యక్రమాలను మోదీ సర్కార్ నిర్వహిస్తోంది.

Read Also : JioHotstar Merger : గతంలో జియో, హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారా? ఇప్పుడు రెండూ కలిసిపోయాయ్.. మీ పరిస్థితి ఏంటి? చెక్ చేసుకోండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 ప్రసంగంలో ప్రధాన మంత్రి స్వానిధి పథకం 68 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చిందని, అధిక వడ్డీ రేటుతో అనధికారిక రంగ రుణాల నుంచి వారికి ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు.

పీఎం స్వనిధి అంటే ఏంటి? :
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 1, 2020న ఈ పథకాన్ని ప్రారంభించింది. వీధి వ్యాపారులకు సబ్సిడీ రేటుతో ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 10వేల నుంచి రూ. 20వేలు, ఆపై రూ. 50వేల వరకు పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందిస్తుంది.

ఈ పథకం రుణాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించేవారికి ఏడాదికి 7 శాతం వడ్డీ సబ్సిడీని అందిస్తోంది. అంతేకాదు.. డిజిటల్ లావాదేవీలు చేసేవారికి సంవత్సరానికి రూ. 1200 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అలాగే ఈ రుణాలను ముందుగానే తీర్చినందుకు ఎలాంటి ఛార్జీలు కూడా లేవు.

పీఎం స్వనిధికి అర్హత ప్రమాణాలు ఏంటి? :
మార్చి 24, 2020 నాటికి లేదా అంతకుముందు పట్టణ ప్రాంతాల్లో విక్రయాలు నిర్వహిస్తున్న అన్ని వీధి విక్రేతలకు పీఎం స్వనిధి పథకం అందుబాటులో ఉంది. పట్టణ స్థానిక సంస్థలు (ULB) జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్/గుర్తింపు కార్డు కలిగిన వీధి విక్రేతలు అర్హులు. సర్వేలో గుర్తించిన విక్రేతలు కానీ వెండింగ్ సర్టిఫికేట్/గుర్తింపు కార్డు జారీ చేయని అలాంటి విక్రేతల కోసం ఐటీ ఆధారిత ప్లాట్‌ఫామ్ ద్వారా తాత్కాలిక వెండింగ్ సర్టిఫికేట్ అందిస్తారు.

ఇలాంటి విక్రేతలకు పర్మినెంట్ వెండింగ్ సర్టిఫికేట్, గుర్తింపు కార్డును వెంటనే ఒక నెల వ్యవధిలోపు జారీ చేసేలా యూఎల్‌బీలను ప్రోత్సహిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత అమ్మకాలు ప్రారంభించిన యూఎల్‌బీ/టౌన్ వెండింగ్ కమిటీ (TVC) ద్వారా లెటర్ ఆఫ్ రికమండేషన్ (LoR) జారీ చేసిన వీధి విక్రేతలు కూడా ఈ పథకానికి అర్హులే. యూఎల్‌బీల భౌగోళిక పరిమితుల్లో చుట్టుపక్కల అభివృద్ధి/పట్టణ/గ్రామీణ ప్రాంతాల విక్రేతలు, యూఎల్‌బీ/టీవీసీ ద్వారా సిఫార్సు లేఖ (LoR) జారీ అవుతుంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? ఫిబ్రవరి 24నే వాయిదా విడుదల.. మీ కేవైసీ స్టేటస్, అర్హతను ఇలా చెక్ చేసుకోండి!

పీఎం స్వనిధి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :
వీధి వ్యాపారులు నేరుగా (PM SVANidhi) పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పీఎం స్వనిధి ఇప్పుడు అందుబాటులో ఉందా? :
(MoHUA) ఆదేశాల ప్రకారం.. పీఎం స్వనిధి పథకం కింద రుణ వ్యవధి డిసెంబర్ 31, 2024న ముగిసింది. జనవరి 1, 2025 నుంచి అన్ని రుణ వాయిదాలకు కొత్త దరఖాస్తులు అంగీకరించడం లేదు. అయితే, బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్ మాట్లాడుతూ.. బ్యాంకుల నుంచి మెరుగైన రుణాలు రూ. 30వేల పరిమితితో యూపీఐ-లింక్డ్ క్రెడిట్ కార్డులు, ఇతర సేవల మద్దతుతో ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.