దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తున్నాను : సీపీఐ నారాయణ

దిశా హత్యాచార ఘటనలో నిందితులు నలుగురిని పోలీసు డిపార్ట్ మెంట్ ఎన్ కౌంటర్ చేయటం శుభం సంతోషం అని సీపీఐ నేత నారాయణ అన్నారు. మహిళలపై ఇలాంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇలాంటి వారి వల్ల భవిష్యత్తులో లాఅండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నమాట వాస్తవమేనని అన్నారు. ఇలాంటి సమయంలో వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా ఉండాలంటే నిందితులను హతమార్చటం అవసరం అని ఆయన అభిప్రాయ పడ్డారు. నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తున్నాని నారాయణ చెప్పారు.
‘దిశ’ హత్యాచార నిందితులను పోలీసులు శుక్రవారం, డిసెంబర్ 6 తెల్లవారుఝూమున ఎన్కౌంటర్ చేశారు. షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా 2019, నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ పై నలుగురు నిందితులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను డిసెంబర్5, గురువారం నాడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కేసు విచారణలో భాగంగా …. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా… వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు రాళ్ళతో పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు అనుమతితో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 3వ తేదీతో న్యాయ శాఖ ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 639) జారీ చేసింది.