National Testing Agency : లోక్సభ ఎన్నికల్లో విద్యార్థులు వేళ్లకు సిరాతో ఎంట్రన్స్ పరీక్షలు రాయొచ్చు.. ఆ పుకార్లను నమ్మొద్దు.. ఎన్టీఏ క్లారిటీ!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి ప్రారంభించింది. దరఖాస్తుకు గడువు ఏప్రిల్ 10 వరకు అవకాశం ఉంది. ఇప్పటివరకూ అప్లయ్ చేయని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
National Testing Agency : 2024 లోక్సభ ఎన్నికలలో ఓటు వేసే వారు వేళ్లకు సిరాతో పరీక్షా హాళ్లలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వివరణ ఇచ్చింది. ఇలాంటి సందేశాలు పూర్తిగా నిరాధారమైనవని, ఎన్టీఏ ఎలాంటి సూచనలను లేదా మార్గదర్శకాలను జారీ చేయలేదని పేర్కొంది.
Read Also : NEET MDS 2024 Result : నీట్ ఎండీఎస్ 2024 రిజల్ట్స్ వచ్చేశాయి.. కట్ ఆఫ్ మార్కులను ఇలా చెక్ చేసుకోండి!
ఎంట్రన్స్ పరీక్ష రాసే విద్యార్థులు ఇలాంటి పుకార్లను పట్టించుకోవద్దు. ప్రతిఒక్కరూ తమ ఓటింగ్ హక్కులను వినియోగించుకోవాలని అభ్యర్థించింది. ఓటింగ్ అనేది అభ్యర్థుల పరీక్షల అర్హతను ప్రభావితం చేయదని ఎన్టీఏ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలని ఎన్టీఏ సూచించింది.
నీట్ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ :
అయితే, వివిధ కారణాల వల్ల నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) (NEET-UG) 2024కి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయిన విద్యార్థులకు బిగ్ రిలీఫ్ అందించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రిజిస్ట్రేషన్ విండోను తిరిగి తెరిచింది. అప్లికేషన్ విండో ఏప్రిల్ 10 రాత్రి 11.50 గంటలకు క్లోజ్ అవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 5న 14 నగరాల్లో నీట్ పరీక్ష :
దేశవ్యాప్తంగా నీట్ (యూజీ) 2024 మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు దేశంలోని 14 నగరాల్లో జరుగనుంది. ఈ పరీక్షను పెన్, పేపర్ (ఆఫ్లైన్) మోడ్లో నిర్వహించనున్నారు. నీట్ యూజీ-2024 పరీక్షకు సంబంధించిన మరిన్ని సందేహాల కోసం, అభ్యర్థులు 011-40759000ని సంప్రదించాలని లేదా neet@nta.ac.inకి ఇమెయిల్ పంపాలని సూచించింది.
ఏప్రిల్ 19 నుంచి లోక్సభ ఎన్నికలు :
లోక్సభ ఎన్నికలు, ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి మొదలై జూన్ 1 వరకు జరుగనున్నాయి. ఎన్నికల తేదీల్లో జరగాల్సిన వివిధ పరీక్షల రీషెడ్యూల్ అయ్యాయి. ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్, నీట్ పీజీ సహా వివిధ పోటీ, ప్రవేశ పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. ఇతర ప్రభావిత పరీక్షలలో మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంహెచ్టీ సీఈటీ), తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈఏపీసెట్), తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పాలీసెట్), చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలు ఉన్నాయి.
నీట్ పీజీ 2024 :
నీట పీజీ పరీక్ష జూన్ 23కి రీషెడ్యూల్ అయింది. ఈ పరీక్ష ఫలితాలు జూలై 15 నాటికి ప్రకటించనుంది. అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 15 వరకు షెడ్యూల్ అవుతుంది.