డేటా చోరీ కేసు సిట్కు అప్పగించిన ప్రభుత్వం

డేటా చోరీ వ్యవహారం గంటకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డేటా చోరీ వ్యవహారంపై మాటల యుద్దం చేసుకుంటుండగా.. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)కు బదిలీ చేసింది. సిట్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం(2019 మార్చి 6) నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు వివరాలను సిట్కు అప్పగించాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్ ఇంచార్జిగా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్గిన అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది.స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సైబర్ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉంటారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు మొత్తం సిట్కు బదిలీ చేస్తారు. డీజీపీ కార్యాలయంలోనే సిట్కు సంబంధించి ప్రత్యేక చాంబర్ను కేటాయించే అవకాశం ఉంది.