పడిపోతున్న ఉష్ణోగ్రతలు..ఇవాళ కూడా వాన కురిసే అవకాశం

హైదరాబాద్ : వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరంలో ఛేంజేస్ అవుతుండడంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు. ఒకవైపు చలి..మరోవైపు వర్షం పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ్లలో పొగమంచుతో పాటు వర్షం కురుస్తుండడంతో స్కూల్కి వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రోజు(జనవరి 29, 2019) ఉదయం నుంచి వాతావరణం చల్లగానే ఉంది. వాన వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలైనా ఇంకా మంచు కురుస్తూనే ఉంది. దట్టంగా మేఘాలు కమ్ముకోవడంతో చీకటిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో రాత్రి వేళ చలి ఎక్కువైంది. సాయంత్రం వేళ బయటకు రావాలంటే జంకుతున్నారు.
నగరంలో వాన పడుతుండడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలకు ఉపక్రమించింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సీఎం కేసీఆర్…అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ని ఆదేశించారు. నగరంలో పరిస్థితులను అధికారులు సమీక్షించారు. కీలక ప్రాంతాల్లో రహదారులు ఏ విధంగా ఉన్నాయో చూశారు. ఏర్పడిన గుంతలను పూడ్చాలని సిబ్బందికి సూచించారు.