ఏ రాష్ట కేసులు ఆ రాష్ట్ర హైకోర్టుకే

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 02:40 AM IST
ఏ రాష్ట కేసులు ఆ రాష్ట్ర హైకోర్టుకే

Updated On : February 13, 2019 / 2:40 AM IST

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్‌లపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డితో కూడిన ధర్మాసనం ఫుల్ బెంచ్ తీర్పునిచ్చింది. . జనవరి 31న విచారణ చేపట్టిన ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం దీనిపై తీర్పును వెలువరించింది. 

రిట్ అప్పీళ్లు, కోర్టు ధిక్కార వ్యాఖ్యలు, పున:సమీక్షా పిటిషన్లను కూడా ఇలాగే బదలాయించాలని తెలిపింది. ఇరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విషయంలో మాత్రం..ఆ వ్యాజ్యాల్లోని ప్రధాన అంశంపై ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో నిర్ణయించిన అనంతరం ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసే విషయంలో ప్రధాన న్యాయమూర్తి జారీ చేసే పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒక్కో కేసు ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి జారీ చేసే పాలనాపరమైన ఉత్తర్వుల ఆధారంగా ఆ కేసుల బదలాయింపు జరపాల్సి ఉంటుందని పేర్కొంది. 

పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 40 (3) వల్ల ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటారని..ఈ వ్యవహారంపై న్యాయపరంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి దానిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించారు. ఈ వ్యాజ్యంలోని కొన్ని కీలక అంశాలు ముడిపడి ఉన్నందున ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేయడమే ఉత్తమమని భావించిన…సీజే.. ఈ నిర్ణయం తీసుకున్నారు.