Sunita Williams: భారత్‌కు రండి.. సునీత విలియమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ..

తాను అమెరికా పర్యటనలు చేస్తున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్‌ను కలిసినప్పుడు సునీతా విలియమ్స్‌ యోగక్షేమాల గురించి ఆరా తీశానని అన్నారు.

Sunita Williams: భారత్‌కు రండి.. సునీత విలియమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ..

Updated On : March 18, 2025 / 6:28 PM IST

నాసా వ్యోమగామి సునీత విలియమ్స్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. భారత ప్రజల తరఫున సునీత విలియమ్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఇవాళ ఓ కార్యక్రమంలో తాను మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోను కలిశానని తెలిపారు. తమ మధ్య జరిగిన సంభాషణలో సునీత విలియమ్స్‌ పేరు ప్రస్తావనకు వచ్చిందని అన్నారు.

సునీత విలియమ్స్‌ విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధత పట్ల ఎంతో గర్వపడుతున్నామని పరస్పరం చెప్పుకున్నామని అన్నారు. మైక్ మాసిమినోతో జరిగిన ఈ సంభాషణ తర్వాత తాను సునీత విలియమ్స్‌కు ఈ లేఖ రాసి తీరాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు.

Also Read: పదవుల రేసులో ఉన్న ఈ నేతలకు తీపికబురు ఎప్పుడు?

తాను అమెరికా పర్యటనలు చేస్తున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్‌ను కలిసినప్పుడు సునీత విలియమ్స్‌ యోగక్షేమాల గురించి ఆరా తీశానని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు సునీత విలియమ్స్‌ విజయాల పట్ల ఎంతో గర్వపడుతున్నారని చెప్పారు.

ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు సునీత విలియమ్స్ స్ఫూర్తిదాయకమైన, ధైర్యవంతమైన, పట్టుదలతో కూడిన వైఖరిని మరోసారి స్పష్టం చేశాయని తెలిపారు.

సునీత విలియమ్స్‌ వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ప్రజల హృదయాలకు దగ్గరగా ఉన్నారని అన్నారు. సునీత విలియమ్స్‌ ఆరోగ్యం కోసం, ఆమె మిషన్‌లో విజయం సాధించడం కోసం భారత ప్రజలు ప్రార్థిస్తున్నారని చెప్పారు. బోనీ పాండ్యా (సునీతా విలియమ్స్‌ తల్లి) సునీతా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.

దివంగత దీపక్‌ భాయ్ (సునీతా తండ్రి) ఆశీస్సులు సునీత విలియమ్స్‌తో ఎప్పటికీ ఉంటాయని అన్నారు. 2016లో తాను అమెరికా పర్యటన సందర్భంగా ఆయనను, సునీత విలియమ్స్‌ను కలుసుకున్నట్లు తనకు గుర్తుందని చెప్పారు.

సునీత విలియమ్స్‌ తిరిగి వచ్చిన తర్వాత భారత్‌కు రావాలని, ఆమెను చూడటానికి ఇక్కడి వారంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. మైఖేల్ విలియమ్స్ (సునీత భర్త)కు తన హృదయపూర్వక శుభాకాంక్షలని మోదీ అన్నారు. బుచ్‌ విల్మోర్‌ కూడా క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.