ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే…కిమ్ మాత్రం మిసైల్ టెస్ట్ లతో బిజీ

ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కువయ్యాయి. చైనాకి ఆనుకొని ఉన్న ఉత్తరకొరియాకు కరోనా ముప్పు అత్యధికంగా ఉంటుంది. మరి ఆ దేశంలో కరోనా కట్టడికి, నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రపంచానికి తెలియదు. ఈ సమయంలో శనివారం ఉత్తరకొరియా రెండు మిసైళ్లను ప్రయోగించింది.
కిమ్ జొంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుత కాలపు నియంత అయిన కిమ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. ఊరంతా ఒక దారైతే… అతడి రూటు వేరు. అయితే ఇదంతా మామూలు సమయంలో చేసుకుంటే ఓకే.. కానీ ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో వణికిపోతున్న సమయంలో శనివారం ఉత్తర కొరియా…. రాజధాని ప్యాంగ్యాంగ్ ఫ్రావిన్స్ నుంచి తూర్పు దిశగా ఈ మిస్సైళ్లు వెళ్లినట్లు దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది.
50 మీటర్ల ఎత్తులో దాదాపు 400 కిలోమీటర్ల దూరం రెండు మిసైళ్లు వెళ్లినట్లు మిలటరీ స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం మిలటరీ డ్రిల్ పేరుతో ఉత్తర కొరియా మిసైల్ టెస్టులు చేసింది. తిరిగి వెంటనే ఇవాళ మరో రెండింటిని పరీక్షించింది. ప్రపంచమంతా ఒకవైపు కరోనా భయాందోళనలో ఉంటే ఉత్తర కొరియా ఇలా మిసైల్ టెస్టులు చేయడంపై దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.