G-20 Summit: పుతిన్ దారిలోనే జిన్పింగ్.. జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు హాజరు కావడం లేదట
ఇదే సమయంలో ఇండియాతో కూడా డ్రాగన్ దేశం కావాలని కయ్యానికి దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సహా ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చైనాలో భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కొత్త వివాదానికి తెరలేపింది.

Xi Jinping: సెప్టెంబరు 8 నుంచి 10 వరకు భారత్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ హాజరుకావడం లేదు. జీ-20 సమావేశానికి జిన్పింగ్ హాజరుకావడం లేదని వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదికను ప్రచురించింది. చైనా దౌత్యవేత్తతో పాటు జీ-20కి చెందిన ఇద్దరు భారతీయ అధికారులు ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ విషయాన్ని నివేదించింది. అయితే చైనా ప్రతినిధిగా ప్రీమియర్ లీ కియాంగ్ను ఆహ్వానించారని, ఆయనను పంపేందుకు చైనా కూడా అంగీకరించిందని సమాచారం. వాస్తవానికి ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు పాల్గొనడంపై ఇంతకు ముందు కూడా ఎలాంటి సమాచారం లేదని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది.
నిజానికి ఈ సమావేశానికి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బుధవారమే ఒక స్పష్టత వచ్చింది. ఆ మర్నాడే జిన్పింగ్ కూడా హాజరు కావడం లేదని నివేదిక రావడం గమనార్హం. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. అయితే జిన్పింగ్ హాజరయ్యే అంశంపై ముందు నుంచి కొన్ని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కారణం, జో బైడెన్ ఆయన ఎదరెదురు పడతారని. తైవాన్ విషయంలో అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక ఇదే సమయంలో ఇండియాతో కూడా డ్రాగన్ దేశం కావాలని కయ్యానికి దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సహా ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చైనాలో భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కొత్త వివాదానికి తెరలేపింది. 2023 ఏడాదికి సంబంధించిన విడుదల చేసిన మ్యాప్ లో చైనా ఈ ప్రయోగం చేసింది. ఆగస్టు 28న విడుదల చేసిన ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్గా పేర్కొంది. 1962 యుద్ధంలో ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ ప్రాంతం తమదని చైనా పేర్కొంది. ఈ నేపథ్యంలో కూడా ఇండియాకు జిన్పింగ్ రాకడ వివాదాస్పదంగానే కనిపించింది. కానీ, ఆయన రాకుండా తమ ప్రతినిధిని పంపిస్తూ మొత్తానికైతే భారీ వివాదాల నుంచి జిన్పింగ్ పక్కకు తప్పుకున్నారు.