కువైట్ టూ హైదరాబాద్:163 మందితో తొలి ‘వందే భారత్’ విమానం

కరోనా వైరస్ వ్యాప్తితో భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో స్వదేశానికి రాలేకపోయారు. అప్పటినుంచి స్వదేశానికి వచ్చేందుకు భారతీయులు ఆశగా ఎదురుచూస్తుండిపోయారు. ఎట్టకేలకు స్వదేశానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు.
కువైట్లో చిక్కుకున్న 163 మంది భారతీయులు హైదరాబాద్కు చేరుకున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ తొలి విమానం తెలంగాణకు చేరుకుంది. ఎయిర్ ఇండియా-988 ఎయిర్ లైన్స్ విమానం శనివారం రాత్రి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 80 మంది ఉన్నారు. మిగతా వారు ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడులకు చెందినవారు ఉన్నారు. విమానంలో వలస కూలీలతోపాటు, పర్యటన నిమిత్తం వెళ్లిన వారు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో వీరికి ఎయిర్ పోర్టు హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని అధికారులు 12 ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో నగరానికి తరలించారు.
14 రోజుల పాటు ఇక్కడే హోం క్వారంటైన్లో ఉండనున్నారు. వీరి కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జీల్లో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రూ.15 వేల నుంచి రూ.30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది. 14 రోజుల తర్వాత వీరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించనున్నారు. అనంతరం వారిని స్వగ్రామాలకు తరలించే అవకాశం ఉంది.