రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. మంగళవారం (మే 19) నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడపాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్ డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ చేపట్టిన ప్రభుత్వం మార్చి నాలుగోవారం నుంచి బస్సులను నిలిపి వేసింది. కేంద్రం వెసులుబాటు కల్పించడంతో మంగళవారం నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీ వర్గాలకు ఆదివారమే సమాచారమిచ్చినట్టు తెలిసింది. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి మంత్రిమండలి సమావేశంలో నివేదిస్తారని తెలిసింది. సమగ్రంగా మంత్రిమండలి చర్చించి, రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. 50 శాతం బస్సులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులున్నా వైరస్ వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం ఇప్పటివరకూ నడపేందుకు వెనుకాడింది.
రాష్ట్రంలో ఆరెంజ్, గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే భావిస్తోంది. కంటెయిన్ మెంటు జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిచే బస్సు సేవలు, పరిమితంగా ప్రయాణికులకు అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, సమన్వయం ఇతర అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే వీలుంది. కేంద్రమిచ్చిన ఇతర సడలింపులనూ పరిశీలించే అవకాశం ఉంది.
ప్రధానంగా కంటెయిన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల నిర్ణయాధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే ఇచ్చింది. దీనిపై కూడా కేబినెట్ చర్చించనుంది. స్టేడియాలు, సెల్ఫోన్ షాపులు, సెలూన్లను అనుమతించాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో మే 29 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మే 31 వరకు పొడిగించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంది.
Read Here>> గ్రేటర్ ఆర్టీసీ రెడీ..ప్రధాన రూట్లలోనే బస్సులు!