Organ Donation Pledge : కామినేని ఆస్పత్రిలో అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల..!
Organ Donation Pledge : ప్రజలందరూ అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. అవయవదానం విషయంలో తప్పక అవగాహన రావాలి. లక్షలాది మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు.
![Organ Donation Pledge : కామినేని ఆస్పత్రిలో అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల..! Organ Donation Pledge : కామినేని ఆస్పత్రిలో అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల..!](https://10tv.in/wp-content/uploads/2024/08/Organ-Donation-Pledge-at-Kamineni-Hospital-And-QR-Code-Released.jpg)
Organ Donation Pledge at Kamineni Hospital And QR Code Released
Organ Donation Pledge : ప్రస్తుత రోజుల్లో ఎవరైనా మరణించిన తర్వాత వారి శరీరంలోని అవయవాలు దానం చేస్తే.. మరో 8 ప్రాణాలు బతుకుతాయని అదనపు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మరణానంతరం తాను తన అవయవాలు దానం చేస్తున్నట్లు ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పారు.
Read Also : Heart Health Foods : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన 5 ఆహారాలివే..!
ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో అవవయదాన అవగాహన ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా చేసుకుంటారు. అవయవదానంపై అపోహలను తొలగించి మరింతమందిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడతారు.
అవయవదానంపై తప్పక అవగాహన రావాలి : వీసీ సజ్జనర్ :
ప్రజలందరూ అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. అవయవదానం విషయంలో తప్పక అవగాహన రావాలి. లక్షలాది మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం.. గత ఏడాది దేశంలో 18,378 డొనేషన్లు అయితే.. అందులో లైవ్ డొనేషన్లు 15,436, కెడావర్ డొనేషన్లు 2,942 చొప్పున ఉన్నాయి.
లైవ్ డొనేషన్లలో కూడా అత్యధికం.. దాదాపు పదివేలకు పైగా మహిళలే చేశారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం. పది ఏళ్ల క్రితం 4,490 మంది మాత్రమే మొత్తం అవయవదానాలు చేశారు.
క్యూఆర్ కోడ్ విడుదల :
ఎవరైనా అవయవదానం చేయాలనుకుంటే అందుకు వీలుగా కామినేని ఆస్పత్రి తరఫున ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్లోని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్ను స్కాన్ చేస్తే.. దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేస్తే చాలు.. ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు.
అవయవదానంపై అవగాహన కల్పించేందుకు కామినేని ఆస్పత్రి డైరెక్ట్ మెసేజ్లు, సోషల్ మీడియాలో సమగ్ర అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద దాతలను ప్రోత్సహించేందుకు ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ కియోస్క్ ఏర్పాటుచేశారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చు.
తమ వివరాలు సమర్పించిన వెంటనే వారి వాట్సప్ నంబర్లకు ‘అవయవ దాత’ కార్డును పంపిస్తారు. ఇందులో ప్రతిఒక్కరూ పాలు పంచుకోవాలని కామినేని ఆస్పత్రి అందరినీ ఆహ్వానిస్తోంది. అవయవదాతగా పేరు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తులకు ప్రాణదానం చేయొచ్చు.
Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!